CM Revanth Reddy Group-2 Appointment Letters: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతంలో కోత విధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు శనివారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్.. చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ ఉద్యోగార్థులకు కీలక సూచనలు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-bandh-over-bc-reservations/
కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సీఎం రేవంత్ హితవు పలికారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అని తెలిపారు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్లు తన దృష్టికి వస్తే, సంబంధిత ఉద్యోగి జీతం నుంచి 10 నుంచి 15 శాతం వరకు కోత విధిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఎలాగైతే అందుతుందో.. అదేవిధంగా కోత విధించిన డబ్బును వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా చూస్తామని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వివరించారు.
‘రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. వృద్ధాప్యంలో వారికి సహాయం చేయడం మన బాధ్యత. విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. శ్రీకాంతాచారి, వేణుగోపాల్రెడ్డి, ఈషాన్రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి.. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధికారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారే తప్ప నిరుద్యోగుల గురించి ఆలోచించలేదు.’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/minister-ponnam-prabhakar-comments-on-bc-reservation-issue/
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60వేల ఉద్యోగాల భర్తీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు గ్రూప్-2 విజేతలకు నియమాక పత్రాలను అందిస్తున్నామని.. గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. పదిహేనేళ్లుగా రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదన్నారు. రూ. 3 కోట్లు తీసుకుని గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు విమర్శలు చేస్తున్నారు. నిరుపేదలు రూ. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. కష్టపడి చదివించిన వారిని అవమానించేలా మాట్లాడారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు.
తన ఫామ్హౌజ్లో ఎకరా పంటపై రూ. కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్దాయన చెప్పారని రేవంత్ అన్నారు. అలా వ్యవసాయంపై రూ. కోటి సంపాదించే విద్యను ఆయన నిరుద్యోగ యువతకు, ప్రజలకు ఎందుకు నేర్పించలేదని ప్రశ్నించారు. ప్రజల గురించి ఆలోచించి ఉంటే రూ. లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం.. మూడేళ్లలో కూలేశ్వరం అయి ఉండేది కాదని సీఎం రేవంత్ మండిపడ్డారు.


