అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 55వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తమ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతోనే తాము ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారని.. మరి ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ని గౌరవించడం లేదని.. స్పీకర్నూ గౌరవించడం లేదని మందిపడ్డారు. కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని.. పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు గవర్నర్ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు. గతంలో మహిళా గవర్నర్ను పదే పదే అవమానించారని గుర్తు చేశారు. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత తమ ప్రభుత్వానిది అన్నారు.
2023లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి స్ట్రేచర్ ఇచ్చారని.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చి మార్చురీకి పంపించారని తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మార్చురిలో ఉందని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు. అయితే కేసీఆర్(KCR) ను తాను ఏదో అన్నట్లుగా కేటీఆర్, హరీశ్రావు చిత్రీకరించారని ఫైర్ అయ్యారు. అంత కుంచిత స్వభావం తనకు లేదన్నారు. కేసీఆర్ వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలన్నారు. కేసీఆర్ సూచనలు చేస్తూనే ఉండాలని.. తాను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు వాళ్ల కుటుంబసభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఆరోపించారు.
ఇక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఈ సభకు రెండు సార్లే వచ్చారని వెల్లడించారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు రూ.57,84,124 జీతభత్యాలు తీసుకున్నారని వివరించారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ తెలంగాణ ప్రజలను వారి ఖర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి పార్టీ నాయకులను ఇలా తయారు చేసి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాశ్రేయస్సు కోసం విపక్షాలు సూచనలు చేస్తే స్వీకరిస్తామని.. కానీ ఇలాగే వ్యవహరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సున్నానే మిగులుతుందని హెచ్చరించారు.