CM Revanth Reddy Hot Comments: రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదురుకాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు, జమిలి ఎన్నికల వంటి కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని పేర్కొన్నారు. అందుచేత భవిష్యత్తులో ఎదురుకానున్న సవాళ్లను అధిగమించేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లాలని సూచించారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక మంత్రుల పనితీరుపై ఈ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలను ఇంఛార్జ్ మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా మంత్రులదేనని తేల్చి చెప్పారు.
పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారికే సముచిత స్థానం లభిస్తుందని ఉద్ఘాటించారు. మంత్రి వాకిటి శ్రీహరి కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అనంతరం జడ్పీటీసీ, జిల్లా అధ్యకుడు, ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు మంత్రి అయ్యారు. అలాగే భట్టి విక్రమార్క ఎన్ఎస్యూఐ నుంచి సీఎల్పీ నేతగా ఎదిగారన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసిన వారికి ఇప్పటికే పదవులు ఇచ్చామన్నారు. తాను కూడా జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తూ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని వెల్లడించారు.