హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయో ఆసియా (Bio Asia) సదస్సు-2025ను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయని తెలిపారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా విలేజ్లు డెవలప్ చేస్తామని వివరించారు. అలాగే గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా హైదరాబాద్ మారిందని తెలిపారు. హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫార్మా రంగం అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఏఐ, క్వాంటమ్, రోబోటిక్స్ సాయంతో వైద్య రంగం రూపురేఖలు మారుతున్నాయని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు హైదరాబాద్కు వచ్చే కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం వెల్లడించారు.
ఇక దేశంలోనే అత్యధిక ఈవీ వాహనాల విక్రయాలతో హైదరాబాద్ ఈవీ కెపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3వేల ఎలక్ట్రిక్ బుస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో డ్రైపోర్టును నిర్మిస్తున్నామన్నారు. ఈ డ్రైపోర్టును ఏపీలోని సీపోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.