అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐతో పాటు అన్నిరాజకీయ పార్టీలను కలుపుకొనిపోతామన్నారు. ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని చెప్పారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తాను నాయకత్వం వహిస్తానని ఈ సభా నాయకుడిగా మాటిస్తున్నానని పేర్కొన్నారు.
కేసీఆర్కు, బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా.. వీలైనంత త్వరగా ప్రధాని మోడీ (PM Modi) దగ్గరకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందాం అని కోరారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందునా చట్ట సవరణ కోసం ప్రధాని మోడీని, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీని అందరం కలిసికట్టుగా కలుద్దామని సూచించారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్రమంత్రులు కిషన్రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ దేనన్నారు (Bandi Sanjay). బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించామని.. ఆ ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నట్లు రేవంత్ చెప్పారు.

