తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మానవత్వం చాటుకున్నారు. అనారోగ్య సమస్యతలో బాధపడుతున్న ఓ చిన్నారితో పాటు మరో దివ్యాంగుడి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది.
“కొండంత కష్టమున్నా.. కన్న వారికి సేవ చేస్తున్న దివ్యాంగుడు కొమరమల్లును, వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈనాడులో నేను కల్లేను.. కన్నవారిని వదల్లేను.. శీర్షికన ప్రచురితమైన వార్తపై ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ కుటుంబానికి తగిన సహాయం అందించాలని హైదరాబాద్ కలెక్టర్ గారిని ఆదేశించారు.
బాధితుల వివరాలను సేకరించిన కలెక్టర్ గారు ఔట్ సోర్సింగ్ పద్ధతిన కొమరమల్లుకు ఉద్యోగం ఇవ్వనున్నట్టు తెలియజేశారు. అలాగే కదలలేని స్థితిలో ఉన్న కొమరమల్లు తండ్రికి ఆటోమేటెడ్ చక్రాల కుర్చీని కూడా సమకూర్చనున్నారు” అని పేర్కొంది.
అలాగే వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారికి ఉచితంగా సర్జరీ చేయించాలని ఆదేశించారు. “వినికిడి లోపం కారణంగా బాధ పడుతున్న నాలుగేళ్ల నేతావత్ లిఖితా శ్రీకి తక్షణం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.
నలుగురు పిల్లలతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన ఆ పాపకు వినికిడి లోపం శాపంగా మారింది. ఎవరు ఏం చెబుతున్నారో కూడా అర్థం కాక అమాయకంగా అలాగే ఉండిపోతోంది. ఆ పాపలో వినికిడి లోపాన్ని గుర్తించిన తర్వాత తల్లిదండ్రులు చికిత్స కోసం ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తప్పని సరి అని చెప్పడంతో అందుకు అవసరమయ్యే ఖర్చును భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదు.
ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే వారు మానవత్వంతో స్పందించారు. వెంటనే ఆ పాపకు అవసరమైన పూర్తి వైద్యం ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చికిత్స జరిగి లిఖిత పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు” అని తెలిపింది.