CM Revanth: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చేలా పార్లమెంట్ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాష్ట్ర మంత్రులతో కలిసి గురువారం ఢిల్లీలో ఖర్గేను కలిశారు. రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన (కాస్ట్ సర్వే), అనంతరం శాసనసభలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుల వివరాలను ఆయనకు వివరించారు.
గవర్నర్ ఈ బిల్లులపై సంతకం చేయకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంచిన విషయాన్ని కూడా ఖర్గే దృష్టికి తీసుకువచ్చారు. బిల్లులు ఆమోదించాలనే డిమాండ్తో రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్టు తెలిపారు.
ఈ బిల్లుల ఆమోదానికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ సంఘాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు కలిసి జంతర్ మంతర్లో బుధవారం రోజు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారని, ఇండియా కూటమిలోని పలువురు ఎంపీలు కూడా సంఘీభావం తెలిపిన విషయాన్ని ఖర్గేకు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.


