CM Revanth Reddy Road Show in JubileeHils Divisions: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పుడు సీఎం రేవంత్ సైతం రంగంలోకి దిగారు. ఆయన ఇవాళ్టి (శుక్రవారం) నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఎన్నికల్లో రేవంత్ ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ను పీసీసీ ఇప్పటికే విడుదల చేసింది. దీని ప్రకారం ఆయన ఇవాళ సాయంత్రం 7 గంటలకు వెంగళరావు నగర్ రోడ్షోలో పాల్గొంటారు. పీజేఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ (చాకలి ఐలమ్మ విగ్రహం) వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్లో ప్రసంగించనున్నారు. అనంతరం, రాత్రి 8 గంటలకు సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా( కృష్ణా అపార్ట్ మెంట్స్ సమీపంలో) వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. అక్కడి ఓటర్లనుద్దేశించి ప్రసంగిస్తారు. రేపు (శనివారం) సాయంత్రం 7 గంటలకు బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో జరగనున్న ఎన్నికల సభల్లోనూ సీఎం పాల్గొననున్నారు. వరుసగా శుక్ర, శని వారాలు రెండు రోజులపాటు సీఎం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననుండడంతో ఆయా డివిజన్లకు ఇన్చార్జీలుగా ఉన్న మంత్రులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కాగా, మూడు రోజుల కిందట యూసఫ్గూడలో జరిగిన సభకు సీఎం హాజరైనప్పటికీ.. అది సినీ కార్మికుల అభినందన సభగానే కాంగ్రెస్ ప్రకటించింది.
నేటి నుంచే కేటీఆర్ రోడ్ షో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెల 11న జరగనున్నది. 9వ తేదీతో ప్రచారం ముగియనుండడంతో సీఎం రేవంత్.. క్యాంపెయినింగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ను సిద్ధం చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉండగా.. ఒక్కో డివిజన్కు ఇద్దరేసి మంత్రులను ఇన్చార్జీలుగా నియమించారు. గత మూడు రోజులుగా మంత్రులు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రంగంలోకి దిగనుండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనున్నది. మరోవైపు, తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రంగంలోకి దిగారు. ఆయన ఇవాళ్టి (శుక్రవారం) నుంచి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా సుడిగాలి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 7 గంటలకు షేక్ పేట్ నాలా నుంచి కేటీఆర్ మొదటి రోజు రోడ్ షో ప్రారంభం కానుంది. ఓయూ కాలనీ , పీస్ సిటీ కాలనీ, శ్రీరామ్ టెంపుల్, సమతా కాలనీ నుంచి.. వినోభానగర్తో రోడ్ షో ముగుస్తుంది. ప్రతి పాయింట్ వద్ద స్థానిక ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాట ముచ్చట కార్యక్రమం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తద్వారా టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాలకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు.. అక్కడి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించడంతో పాటూ కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను వివరిస్తున్నారు. ఇటు సీఎం రేవంత్, అటు కేటీఆర్ ఇవాళ్టి నుంచి రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరంగా మారింది.


