Friday, June 6, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: అది బీఆర్ఎస్ కాదు.. దెయ్యాల రాష్ట్ర సమితి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: అది బీఆర్ఎస్ కాదు.. దెయ్యాల రాష్ట్ర సమితి: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొత్త పేరు పెట్టారు. ఇటీవల ఆ పార్టీలో జరిగిన పరిణామాలపై తనదైన శైలిలో దాడికి దిగారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నారని ఎమ్మెల్సీ కవతి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మౌనంగా ఉన్న రేవంత్ రెడ్డి.. తాజాగా స్పందించారు.

యాదాద్రి(Yadagirigutta)భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడుతూ.. “బీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి కాదు, దెయ్యాల రాజ్య సమితి. దెయ్యాల నాయకుడు ఫాంహౌస్ లో నిద్రపోతున్నాడు. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకు నాకు కార్యకర్తలు, ప్రజల సహకారం కావాలి. బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారు మాపై విమర్శలు చేస్తున్నారు” అంటూ నిప్పులు చెరిగారు.

అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆశీస్సులతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. గతంలో యాదగిరిగుట్ట పేరు మార్చి యాదాద్రి చేశారు.. తాము అధికారంలోకి వస్తే మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పామని.. చెప్పినట్లే చేశామని గుర్తుచేశారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయంలో పనులు చేపట్టామని అన్నారు. తిరుమల మాదిరిగా యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అందుకే టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు ఏర్పాటు చేశామని వివరించారు. యాదగిరిగుట్టలో అపచారం వల్లే గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకుందని.. చేసిన పాపాల వల్లే కిందపడి కేసీఆర్ మక్కెలు విరిగాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సబర్మతి, గంగా, యమున ప్రక్షాళన చేస్తున్నప్పుడు మూసీ ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ప్రశ్నించారు. తాము మూసీని డెవలప్ చేసుకుంటాం అనేసరికి ఏడ్చి గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవద్దా.. అక్కడి ప్రజలు ఇంకా ఎన్నాళ్లు ఈ మూసీ మురికిలో ఉండాలని నిలదీశారు. నల్లగొండ జిల్లా ప్రజల బాధలు బీఆర్ఎస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా? అని రేవంత్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News