తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన అనేక కీలక వ్యవస్థలను ప్రస్తుతం చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే మూలస్తంభాలని సీఎం అన్నారు.
“కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. వారికి ఇప్పటికే రూ.21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను అందించాం. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించాం. రుణాలు ఇచ్చి బస్సులు కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు తీసుకుని మహిళా సంఘాలకు ఆదాయం కల్పిస్తున్నాం. త్వరలోనే క్యూఆర్ కోడ్ కార్డు ద్వారా మహిళలకు ఉచితంగా వైద్యపరీక్షలు చేయించే పథకాన్ని కూడా తీసుకురాబోతున్నాం” అని వివరించారు.
ఇక రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రైతుల భూములపై ఎలాంటి వివాదాలు లేకుండా చేసేందుకు ‘భూభారతి’ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం అని పేర్కొన్నారు. “వందేళ్లలో జరగని కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ విప్లవాత్మక నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. రాబోయే జనగణనలో కులగణన అంశాన్ని కూడా చేర్చుతామని కేంద్రం ప్రకటించింది” అన్నారు.
ఉద్యోగ నియామకాల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ వారి విశ్వాసాన్ని చూరగొన్నామని చెప్పారు. సివిల్స్కు ఎంపికైన వారికి ప్రోత్సాహకంగా రూ.లక్ష అందిస్తున్నామని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.