Congress Leaders Fire on Konda Murali Comments: తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులపై మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై త్వరలోనే పరిశీలకులను నియమిస్తామని పీసీసీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పరిశీలకులు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
మరోవైపు కొండా మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కొండా మురళికి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, బస్వరాజు సారయ్య, గండ్ర సత్యనారాయణ రావు, సుధారాణి ఇతర నాయకులు హాజరయ్యారు.
అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా సరే నోటికి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. కులం అడ్డుకుని నచ్చినట్లుగా మాట్లాడుతామంటే కుదరదని తేల్చిచెప్పారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలని కానీ అడ్డగోలుగా బహిరంగా మాట్లాడం ఏంటని మండిపడ్డారు. ఇలాంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదన్నారు. కొండా మురళి చేసిన పాపాలను తాము ఎక్కువ కాలం మోయలేమని.. పార్టీ పెద్దలు ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. జిల్లాలో పార్టీకి నష్టం కలుగుతుంటే తమకు బాధ కలుగుతోందని చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఎమ్మెల్యేలు అందరం కలిసి ఈ అంశంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
కాగా వరంగల్లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో కొంతమంది నాయకులు టీడీపీలో పదవులు అనుభవించిన తర్వాత ఆ పార్టీని భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి కేసీఆర్, కేటీఆర్లను నాశనం చేశారని విమర్శించారని.. పరీక్షంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పరకాలలో 75 ఏళ్ల నాయకుడొకరు తన దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె సుష్మిత పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.