Lal Darwaza Bonalu: తెలంగాణలో ప్రసిద్దిచెందిన లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్చారణలతో మంగళవాయిద్యాల నడుమ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయం, బంగారుమైసమ్మ దేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పగూడ శ్రీ మహంకాళిదేవాలయం, సుల్తాన్షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేళా ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురా కోటమైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ కనకదుర్గ ఆలయం, దేవి దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, మేకల్బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయాలలో శిఖరపూజ, ధ్వజా రోహణ, కలశస్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా, జీహెచ్ఎంసి చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నలు 117 వ బోనాల వార్షికోత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీయాదవ్, కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు పోసాని సతీష్ ముదిరాజ్, బి.అమర్నాథ్ యాదవ్లు ఆలయానికి విచ్చేసిన కమిషనర్లకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీయాదవ్ ఆధ్వర్యంలో శిఖరపూజ, ధ్వజా రోహణంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల బ్రౌచర్ను సివి ఆనంద్, ఆర్.వి కర్ణన్ ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆలయ కమిటి తరపున మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్ కుటుంబం తొలి బోనం సమర్పించింది.

ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు నిజాం కాలం నుండి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తన చేతుల మీదుగా బోనాల ఉత్సవాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బోనాల ఉత్సవాలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన సూచించారు. బోనాల ఉత్సవాలకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుంఎడా భక్తులు పోలీసులకు, ఆలయల కమిటీ ప్రతినిధులకు సహకరించాలని కోరారు.
ఎంతో విశిష్ట గల లాల్ దర్వాజ మహంకాళి బోనాలు ఉత్సవాలను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగాగా ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో ఎస్బీ బి డీసీపీ అపూర్వ రావు, ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్, ఛత్రినాక ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, శాలిబండ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, మొఘల్పురా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీచైర్మన్లు కె.వెంకటేష్, జె.లక్ష్మీనారాయణ గౌడ్, ఎ.మాణిక్ ప్రభు గౌడ్, జి.రాజ్కుమార్ యాదవ్, సీర రాజ్కుమార్, కె.విష్ణు గౌడ్,తిరుపతి నర్సింగ్ రావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎ.చంద్రకుమార్, ఎ.వినోద్ కుమార్, శేషునారాయణ, జి. హరీష్గౌడ్,. ఎ.యశ్వంత్ గౌడ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.


