Best apps for cyber safety : ఖరీదైన ఫోన్ కిందపడితే పగిలిపోతుందని పౌచ్ వేసుకుంటాం, కానీ ఆ ఫోన్లోని మన జీవితాన్ని, డబ్బును కొల్లగొట్టే సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాం..? డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరింపులు, ఫోన్ పోతే ఖాతా ఖాళీ అవ్వడాలు.. ఇలాంటి వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ సైబర్ మాయాజాలంలో చిక్కుకోకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని శక్తివంతమైన యాప్లు అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా..? నిజామాబాద్ సైబర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు సూచించిన ఈ ‘డిజిటల్ కవచాల’పై ప్రత్యేక కథనం.
మోసాల మాయాజాలం.. నిజామాబాద్లో పెరిగిన నేరాలు : నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరాలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి.
డిజిటల్ అరెస్ట్: ఓ విశ్రాంత ఉద్యోగి దంపతులను ‘డిజిటల్ అరెస్ట్’ చేశామని బెదిరించి, 50 గంటల పాటు మానసికంగా హింసించి, వారి ఖాతా నుంచి రూ.30 లక్షలు కాజేశారు.
ఫోన్ పోతే.. ఖాతా ఖాళీ: ఫోన్ పోగొట్టుకున్న ఓ వ్యక్తి ఖాతా నుంచి మరుసటి రోజే రూ.1.50 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటనలు మన ఫోన్ భద్రత ఎంత ముఖ్యమో హెచ్చరిస్తున్నాయి.
మీ ఫోన్కు రక్షణ కవచాలు.. ఈ యాప్లు తప్పనిసరి : ఈ సైబర్ దాడుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం, పోలీసులు కొన్ని ప్రత్యేక యాప్లను, పోర్టళ్లను అందుబాటులోకి తెచ్చారు.
ఎం-కవచ్ 2 (M-Kavach 2): మీ ఫోన్కు సెక్యూరిటీ గార్డ్ : ఇది మన ఫోన్కు పూర్తిస్థాయి భద్రతను అందించే యాప్. మీ ఫోన్లోకి వచ్చే నకిలీ లింకులు, అనుమానాస్పద మెసేజ్లు, హానికరమైన యాప్లను ఇది వెంటనే గుర్తిస్తుంది. మీ ఫోన్లోని భద్రతా లోపాలను పసిగట్టి, మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉచితంగా అందుబాటులో ఉంది.
సంచార్ సాథీ (Sanchar Saathi): పోయిన ఫోన్కు సంజీవని : ఇది కేంద్ర టెలికాం శాఖ రూపొందించిన వెబ్ పోర్టల్/యాప్. మీ ఫోన్ పోయిన వెంటనే, ఈ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా దానిని బ్లాక్ చేయవచ్చు. దీనివల్ల ఇతరులు మీ ఫోన్ను వాడలేరు, మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించలేరు. అనుమానిత కాల్స్, SMSలపై ఫిర్యాదు కూడా చేయవచ్చు.
సీఈఐఆర్ (CEIR) పోర్టల్: దొంగిలించినా దొరకాల్సిందే : ఇది పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను గుర్తించేందుకు ఉద్దేశించిన అధికారిక వెబ్ పోర్టల్. ఫోన్ పోగానే, దాని ఐఎంఈఐ (IMEI) నంబర్తో ఈ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే, ఆ ఫోన్ను బ్లాక్ చేస్తారు. దొంగ ఆ ఫోన్లో వేరే సిమ్ వేసి వాడటానికి ప్రయత్నించగానే, దాని లొకేషన్ పోలీసులకు తెలిసిపోతుంది.
నిజామాబాద్లో ఇలాగే మూడు రోజుల్లో ఓ ఫోన్ను రికవరీ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో నెలకు సుమారు 4000 ఫోన్లు పోతుంటే, ఈ సాంకేతిక సాధనాల వల్ల సుమారు 800 ఫోన్లను రికవరీ చేయగలుగుతున్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకుని, ఈ యాప్లను మన ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా, మన డిజిటల్ జీవితానికి మనమే రక్షణ కవచం ఏర్పరుచుకోవచ్చు.


