అణిచివేయబడిన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే వర్గీకరణ అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం కాదని మంత్రి వివరించారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని ఆదేశిస్తూ, ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలను తీసుకెళ్లే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, లక్ష్మికాంతరావు, అడ్లూరి లక్ష్మణ్, మందుల సామెల్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను నెరవేరుస్తున్న సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణను ముందుకు తీసుకెళ్లే అంశంపై మంత్రితో వారు చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. వర్గీకరణలో అవలంభించిన శాస్త్రీయ పద్ధతులను ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. ఇతరులు సృష్టించే అపోహలను, అనుమాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలది, మాదిగ సామాజిక వర్గ నాయకులదేనన్నారు.
మొదటి నుంచీ మద్దతుగా
వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ మద్దతుగా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. 2005లో అసెంబ్లీలో వర్గీకరణకు అనుకూలంగా వైఎస్ఆర్ తీర్మానం చేశారు. ఈ తీర్మానం ఆధారంగా 2006లో నాటి యూపీఏ ప్రభుత్వం జస్టీస్ ఉషా మెహ్ర కమిషన్ వేసిందన్నారు. 2006లో దవిందర్ సింగ్ వేసిన కేసులో, వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనను వినిపించిందన్నారు. 2018లో రాహుల్ గాంధీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని, హైదరాబాద్లో జరిగిన ఎడిటర్ మీట్లో చెప్పారన్నారు. 2023లో చేవెళ్లలో జరిగిన ఎస్సీ డిక్లరేషన్ సభలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేశారని తెలిపారు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే, సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు సీనియర్ అడ్వకేట్ను సీఎం రేవంత్రెడ్డి నియమించారన్నారు. 2006 నుంచి పెండింగ్లో ఉన్న కేసులో, 2024 ఆగస్ట్ ఒకటిన తీర్పు వచ్చిందని, తీర్పు వచ్చిన గంట లోపలే వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేశారని మంత్రి దామోదర గుర్తు చేశారు. ఆ వెంటనే కేబినెట్ సబ్ కమిటీని నియమించారని, ఆ తర్వాత వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్ను నియమించారన్నారు.
8000కు పైగా వినతులు
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, జనాభా, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కమిషన్ అధ్యయనం చేసిందన్నారు. ఉమ్మడి పది జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి, ఆయా సామాజిక వర్గాల సంఘాల నుంచి రెప్రజంటేషన్లను తీసుకున్నదన్నారు. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో సుమారు 8 వేలకుపైగా వినతులను తీసుకుని, వాటిని క్రోడీకరించిందన్నారు. అన్నిరకాల విశ్లేషణ, అధ్యయనం తర్వాత శాస్త్రీయంగా రూపొందించిన రిపోర్ట్ను అందించిందన్నారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన మరునాడే అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారని మంత్రి గుర్తు చేశారు. కోర్టు తీర్పు వచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఇది కాంగ్రెస్ కమిట్మెంట్ అని, సీఎం రేవంత్రెడ్డికి మాదిగల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యేలకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
సమన్యాయంతో వర్గీకరణ
ప్రతి కులానికి న్యాయం చేసేలా వర్గీకరణ ఉందని మంత్రి తెలిపారు. అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ వన్లో, మద్యస్తంగా ఉన్న 18 కులాలను గ్రూప్2లో, కొంత మెరుగ్గా ఉన్న కులాలను గ్రూప్3లో చేర్చాలని కమిషన్ సూచించిందన్నారు. కమిషన్ సూచించినట్టుగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా వర్గీకరణ జరుగుతోందన్నారు. మాదిగ, మాదిగ సామాజిక వర్గాల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతున్న ఈ తరుణాన్ని పండుగలా జరుపుకోవాలన్నారు. వర్గీకరణ విజయోత్సవాల్లో అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. సమావేశంలో ప్రొఫెసర్ మల్లేశం, టీపీసీసీ నాయకుడు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.