Saturday, November 15, 2025
HomeతెలంగాణDasara 2025: ఎక్సైజ్‌ శాఖకు ఫుల్‌ కిక్కు.. ఈసారి దసరాకు ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందంటే?

Dasara 2025: ఎక్సైజ్‌ శాఖకు ఫుల్‌ కిక్కు.. ఈసారి దసరాకు ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందంటే?

- Advertisement -

Dasara Liquor Sales 2025: తెలంగాణలో అతిపెద్ద పండుగగా పేరొందిన దసరాకు ప్రతీఏడు లాగే ఈసారి కూడా మద్యం ఏరులై పారింది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. గాంధీ జయంతి నేపథ్యంలో దసరా నాడు మద్యం షాపులు తెరవనప్పటికీ అమ్మకాలు మాత్రం ఆగలేదు. అక్టోబర్‌ 2 పండగ నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే స్టాక్కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. నేపథ్యంలోనే తెలంగాణలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మడైంది. సెప్టెంబర్ 30న రూ. 333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 26 నుంచి సాధారణ రోజులతో పోలిస్తే మద్యం అమ్మకాలు డబుల్ అయినట్లు ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ వారంలో అమ్మకాలు రూ. 1000 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. దసరా 3 రోజుల్లో 6.71 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడు అయినట్లు ఎక్సైజ్శాఖ లెక్కలు చెబుతున్నాయి. బీర్ల విషయానికి వస్తే 7.22 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది.

గాంధీ జయంతి అయినా తగ్గని అమ్మకాలు..

ఈ ఏడాది దసరా పండుగ, గాంధీ జయంతి రెండూ ఒకే రోజు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మద్యం షాపులు, చికెన్, మటన్ దుకాణాలను మూయాలని ఆదేశించింది. ప్రతీ ఏడాది దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే, ఈ సారి మద్యం దుకాణాలు మూసి వేయడంతో భారీగా అమ్మకాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు రివర్స్ చేశారు మందుబాబులు. దసరా నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ మూసివేయగా.. మటన్‌, చికెన్ మటన్ దుకాణాలు మాత్రం పలు ప్రాంతాల్లో తెరిచే ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఆయా దుకాణాలు చూసి చూడనట్లుగా వదిలేశారన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. గాంధీ జయంతి నాడు దసరా రావడం బెల్ట్ షాపుల నిర్వాహకులకు భారీగా కలిసి వచ్చింది. వీరంతా రెండు రోజుల ముందే భారీగా కొనుగోళ్లు చేసి.. స్టాక్పెట్టుకొని పండుగ నాడు భారీ ధరలకు అమ్ముకున్నారు. ఎక్సైజ్ అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ లోని మీర్ చౌక్కు చెందిన నర్సింగరావు అనే వ్యక్తి అనుమతులు లేకుండా భారీగా మద్యం నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిన్న దాడులు జరిపిన సౌత్ జోన్ పోలీసులు ఎమ్మార్పీ ధరకు షాపుల్లో మద్యం కొనుగోలు చేసి ఎక్కువకు అమ్ముతున్నట్లు తేల్చారు. అతని వద్ద 57.2 లీటర్ల మద్యాన్ని గుర్తించారు. ఈ మద్యం విలువ 60 వేలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, ప్రతిసారి లాగే ఈసారి కూడా మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు నెలకొల్పాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad