Cabinet Expension: తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో తన పేరు ఉండటం పట్ల ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు. మీడియా తో మాట్లాడుతూ… తన జీవితంలో ఈరోజు ఎన్నటికీ మరిచిపోలేని రోజు అని వివరించారు. నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. సీఎం మాటలతో నేను తెలియని ఆనందంలోకి వెళ్లిపోయాను. ఆదివారం 11 గంటలలోపు రాజ్ భవన్ కు చేరుకోవాలని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మంత్రిగా పాటు పడాలని సూచించారు. నాలాంటి ఓ సామాన్య కార్యకర్తకు మంత్రి పదవి దక్కడం కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ధి తెలుపుతుందాన్నారు. నాకు అధిష్టానం ఇచ్చిన గుర్తింపుని బాధ్యతగా.. నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తనకి కాబినెట్ లో అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ సామజిక వర్గం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా విస్తరించిన మంత్రి వర్గంలో అడ్లురితో పాటుగా బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల నుంచి వివేక్ అవకాశం దక్కినట్లు కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:00 – 12:20 గంటల మధ్యలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవశర్మ ప్రమాణ స్వీకారం చేయించానున్నారు. వీరితో పాటు రాష్ట్ర శాశనసభ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.