Encounter| ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులు తినే అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానికులైన గుత్తికోయలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఎన్కౌంటర్పై చనిపోయిన మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని కోరారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… సంవత్సరం కాలంలోనే మళ్లీ ఎన్కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు ఈ ఎన్కౌంటర్పై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది? అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు. బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయి. అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారు. బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్ కౌంటర్లు” అంటూ ట్వీట్ చేశారు. కాగా భద్రతా దళాలు జరిపిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.