Jeevan Reddy comments on Congress party: కాంగ్రెస్ లో విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకరు సైలంట్ అయ్యారని అనుకునేలోపే మరొకరు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. సొంత పార్టీవారే తనను హలాల్ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారంటూ జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి చంపేయండని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు జీవన్రెడ్డి వాపోయారు. బీఆర్పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీపై జీవన్రెడ్డి తీవ్ర అసంతృప్తి చేశారు. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్ఎస్ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని విమర్శించారు. పార్టీలో తమ స్థానమేంటని అడ్లూరిని ప్రశ్నించారు.
కౌలుదారులం కాదు.. పట్టాదారులం: తాము వలసదారులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులనుభవిస్తున్న వారిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చురకలు అంటించారు . మంత్రి శ్రీధర్బాబు, అడ్లూరి అడ్డుకోకపోతే ఆ రోజే కథ వేరుండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌలుదారులం కాదు.. పట్టాదారులమంటూ వ్యాఖ్యానించారు. గిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా తీవ్రస్థాయిలో జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాలను వలసదారులకు రాసిచ్చారా అంటూ మంత్రి ఎదుట తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఇష్టం లేకపోతే బయటకు వెళ్లగొట్టండి: నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా కింద పోరాడుతున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పార్టీలో నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి బీఆర్ఎస్ నాయకులకు బీఆర్పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీల్లో పదవులు ఇస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పెంబట్ల దేవాలయం తప్ప, మిగతా అన్ని కమిటీలు బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి వెళ్లాయని తెలిపారు. పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీలో సైతం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులకు స్థానం కల్పించారని ఆరోపించారు. వలసదారులకు ప్రాధాన్యత ఇస్తూ పోతే ఇక పార్టీలో మేము ఉండి ఎందుకని ప్రశ్నించారు. మీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని బయటకు వెళ్లగొట్టండని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో వలసదారుల ముందు తలవంచనని అన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/sadar-celebrations-chief-guest-cm-revanth-reddy/
మానసిక క్షోభకు గురి చేయకండి: పార్టీ నిర్ణయాల కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని జీవన్ రెడ్డి అన్నారు. ఒక్కోసారి రాత్రులు నిద్ర కూడా పట్టని పరిస్థితి నెలకొందని వాపోయారు. తమను కొద్దికొద్దిగా చంపకండని అన్నారు. ఒకేసారి నరికేసే నిర్ణయమైనా తీసుకోండని తన ఆవేదనను వ్యక్తం చేశారు. వలసదారుల్లా దోచుకునే వారిమి కాదని పదవులు ఉన్న లేకపోయినా పార్టీ కోసం ప్రజల కోసం పని చేసే తత్వం తన కార్యకర్తలదని అన్నారు.తమకు న్యాయం చేయాల్సిందిగా మంత్రి అడ్లూరిని కోరారు. జీవన్ రెడ్డి వెంట వెళ్లిన నాయకులు కార్యకర్తలు సైతం పార్టీలో తమ స్థానం మనుగడ విషయంలో అండగా ఉండాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.


