Saturday, November 15, 2025
HomeతెలంగాణRanji player : రంజీ క్రికెటర్.. సైబర్ కిలాడీ! బెట్టింగ్ మత్తులో అడ్డదారి పట్టిన ఆటగాడు!

Ranji player : రంజీ క్రికెటర్.. సైబర్ కిలాడీ! బెట్టింగ్ మత్తులో అడ్డదారి పట్టిన ఆటగాడు!

Ex-Ranji player arrested for cyber crime : తండ్రి పేరుమోసిన రంజీ క్రికెటర్.. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. కొడుకును జాతీయ జట్టులో చూడాలని వారి కల. ఆ కొడుకు కూడా క్రికెట్‌లో రాణిస్తూ, బీటెక్ పూర్తి చేశాడు. కానీ, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ, అతడిని దారితప్పేలా చేసింది. క్రికెట్ బ్యాట్ వదిలి, సైబర్ నేరాలనే కొత్త ఆట మొదలుపెట్టాడు. చివరికి, ఓ చిన్న ఆధారంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి, కటకటాల పాలయ్యాడు. ఇంతకీ ఎవరీ మాజీ రంజీ ఆటగాడు..? అతని నేర కథా చిత్రమేంటి..?

- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు, నకిలీ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయానని ఆగస్టులో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు, ఆ డబ్బు వడోదరలోని ఓ బ్యాంకు ఖాతాకు జమ అయినట్లు తెలిసింది. ఆ ఖాతాదారుడిని విచారించగా, అసలు సూత్రధారి బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ రిషి అరోథే (30) అని తేలింది.

క్రికెట్ నుంచి క్రైమ్‌లోకి : రిషి అరోథే తండ్రి, బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్. తండ్రి ప్రోత్సాహంతో, రిషి కూడా బరోడా రంజీ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కానీ, అతని దృష్టి అడ్డదారుల్లో డబ్బు సంపాదనపై మళ్లింది.

బెట్టింగ్ బానిస: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై, గోవాకు మకాం మార్చాడు.
సైబర్ నేరగాళ్లతో దోస్తీ: అక్కడే సైబర్ నేరగాళ్లతో పరిచయాలు పెంచుకుని, వారి మోసాలకు సహకరించడం మొదలుపెట్టాడు.

మోసం చేసే పద్ధతి.. కోటికి రూ.10 లక్షల కమీషన్ : రిషి తన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు ఉపయోగించాడు.
మ్యూల్’ ఖాతాలు: సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును జమ చేయడానికి, ఇతరుల పేర్ల మీద ‘మ్యూల్’ (అద్దె) బ్యాంకు ఖాతాలను సమకూర్చేవాడు.

క్రిప్టోలోకి మార్పిడి: ఆ ఖాతాల్లో జమ అయిన డబ్బును, పోలీసులకు దొరక్కుండా, వెంటనే బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి విదేశాలకు తరలించేవాడు.

భారీ కమీషన్లు: ఇలా రూ.కోటి నగదును మళ్లిస్తే, అతనికి ఏకంగా రూ.10 లక్షల కమీషన్ లభించేది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు, విదేశీ ఫోన్ నంబర్లతో వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపులు నడుపుతూ, ఇతరుల పేర్లపై సిమ్‌కార్డులు వాడుతూ జాగ్రత్త పడ్డాడు.

తల్లి కన్నీరు.. పోలీసుల పట్టు : “తప్పుడు దారిలో వెళ్లొద్దు” అని తల్లి ఎన్నిసార్లు మందలించినా, రిషి తన తీరు మార్చుకోలేదు. చివరికి, హైదరాబాద్ పోలీసులు రెండు రోజుల పాటు మాటు వేసి, అతడిని వడోదరలోని తన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. మొదట నేరం అంగీకరించకపోయినా, పోలీసులు ఆధారాలు చూపడంతో తలవంచాడు. “నా కొడుకు నా మాట వినలేదు” అంటూ ఆ తల్లి కన్నీరు పెట్టుకోవడం, పోలీసులను సైతం కదిలించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad