ప్రతి ఏడాది మృగశీర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసారం(Fish Prasadam) పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. బత్తిని కుటుంబ సభ్యులు గత 178 సంవత్సరాలుగా దీనిని కొనసాగిస్తున్నారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధుల సమస్యల నుంచి ఈ చేప ప్రసాదం ఉపశమనం కలిగిస్తుందని విశ్వసిస్తారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు నగరానికి తరలివస్తారు. బత్తిని కుటుంబం ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది.
ఈ సంవత్సరం కూడా జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బత్తిని కుటుంబ సభ్యులు ప్రకటించారు. రోగులు, వారి సహాయకుల కోసం భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ 140 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నగరంలో అన్ని చోట్ల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు బస్సులు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్, జలమండలి మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేయనున్నారు.టు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎలాంటి ఘటనలు జరిగినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉంది. ఈ మందు కోసం వేలాది మంది ప్రజలు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుంటున్నారు.
చేప ప్రసాదానికి వచ్చే వారు ప్రతిసారి చేపపిల్లలను కొనుగోలు చేయాల్సి వచ్చేదని..ఈసారి మాత్రం ప్రభుత్వం ఉచితంగానే చేపపిల్లలను సరఫరా చేయనున్నట్లు బత్తిని అమర్ నాథ్ గౌడ్ తెలుగు ప్రభకు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించామని.. ఇందుకు మంత్రి కూడా అంగీకరించారని చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు ఫిషరీస్ డిపార్టమెంట్ ఉచితంగానే చేప పిల్లలను అందించేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు.
వైద్యుల ద్వారా, సైన్స్ ద్వారా నిరూపించలేకపోయినా తమ తాత ముత్తాలకి ఓ రుషి అందించిన ఫార్ములా ప్రకారం వంశపారం పర్యంగా ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ మందు ఆస్తమా రోగాన్ని నయం చేస్తుందని అమర్ నాథ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మందు పంపిణీని 1845లో ప్రారంభించామని అప్పటి నుంచి 177 సంవత్సరాలుగా బత్తిని సోదరుల వారసులు కొనసాగిస్తూ వస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ సేవను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఏదైనా అవార్డు ఇస్తే తమకు ప్రోత్సాహకంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా పేరు ప్రతిష్టలు దక్కుతాయని వెల్లడించారు.