DEVIL FISH: హైదరాబాద్లోని చర్లపల్లి చెరువులో పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న మరియు స్థానిక చేపలకు ముప్పుగా మారిన ‘డెవిల్ ఫిష్’ (రాక్షసి చేపలు) సమస్య తీవ్రరూపం దాల్చింది. చెరువులో విపరీతంగా పెరిగిపోయిన ఈ చేపల సంతతిని అరికట్టడానికి స్థానిక మత్స్యకారులు క్వింటాళ్ల కొద్దీ చేపలను కాల్చివేశారు. ఆదివారం ఉదయం చెరువు ఒడ్డున కాలి బూడిదైన వేలాది చేపల అవశేషాలు కనిపించగా.. కొన్ని సగం కాలిపోయిన చేపలు తిరిగి నీటిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు చూపరులను ఆశ్చర్యం లోకి నెట్టేశాయి.
చర్లపల్లి చెరువులో ‘రాక్షసి’ చేపల దహనం…
పర్యావరణానికి ముప్పుగా మారిన విదేశీ జాతి
చర్లపల్లి మత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈగ సత్యనారాయణ, కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని నెలలుగా చెరువులో డెవిల్ ఫిష్ సంతతి అసాధారణంగా పెరిగిపోయింది. “కొన్ని నెలల క్రితం ప్రభుత్వ అధికారులు మాకు చేప పిల్లలను ఇచ్చారు. చాలా ఆశతో వాటిని చెరువులో వదిలాం. అయితే లార్వా రూపంలో చెరువులోకి వచ్చిన రాక్షసి చేపలు మంచినీటి చేపలను పూర్తిగా తినేశాయి. ప్రస్తుతం చెరువులో వేలాది రాక్షసి చేపలు మాత్రమే ఉన్నాయి. అందుకే వాటిని పట్టి తగులబెట్టాల్సి వచ్చింది. ఇది తప్ప మాకు మరో మార్గం కనిపించలేదు” అని వారు వాపోయారు.
అసలేంటీ ఈ రాక్షసి చేపలు?
హైదరాబాద్లోని లాబొరేటరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ (LaCONES), CCMB పరిశోధన ప్రకారం, ఈ చేప జాతిని మన దేశంలో మొదటగా అలంకరణ కోసం, అక్వేరియంలను శుభ్రం చేయడానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా తూర్పు కనుమలలోని 60-65 శాతం జలవనరులకు ఇవి విస్తరించాయి.
డెవిల్ ఫిష్ స్థానిక పర్యావరణ వ్యవస్థలకు తీవ్రమైన ముప్పుగా మారాయి. అవి స్థానిక చేప జాతులను, చేప గుడ్లను, చనిపోయిన కళేబరాలను కూడా తింటాయి, సహజ ఆహారపు గొలుసును దెబ్బతీస్తాయి. నీటిలో కరిగిన ఆక్సిజన్ను అధికంగా వినియోగించుకోవడం వల్ల ఇతర జలచరాలకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా, వాటి పదునైన పళ్లతో, బలమైన కవచ శరీరాలతో మత్స్యకారుల వలలను కొరికేసి పాడుచేసే అవకాశం ఉంది.. మార్కెట్లో వీటికి ఎటువంటి విలువ లేకపోవడంతో, మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితి డెవిల్ ఫిష్ వల్ల కలిగే పర్యావరణ, ఆర్థిక నష్టాలను స్పష్టం చేస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరియు పర్యావరణ నిపుణులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, భవిష్యత్తులో మరిన్ని జలవనరులు ఈ ‘రాక్షసి’ చేపల బారిన పడే ప్రమాదం ఉందని మాత్స్య కారులు కోరుతున్నారు.