Food Safety raids on E commerce Platforms WareHouses: షాప్కి సరుకులు ఏం కొంటాంలే అని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. నిమిషాల్లో గ్రాసరీస్ డెలివరీ అంటూ మిమ్మల్ని ఆకట్టుకుంటున్న ప్రముఖ ఈ కామర్స్ గోదాముల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. కుళ్లిన కూరగాయలు, ఆహార పదార్థాలపై ఈగలు, దోమలతో.. తలచుకుంటేనే రోగాలన్నీ కళ్లముందు కదలాడే దృశ్యాలు అక్కడ ప్రస్ఫుటమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వేర్ హౌస్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: https://teluguprabha.net/national-news/pm-modi-inaugurates-ram-statue-goa-jeevottam-math/
నాణ్యత లేమి ఆహారం, సరుకులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. కొందరి తీరు మారడం లేదు. కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కస్టమర్లకు సరుకులు డెలివరీ చేస్తున్నట్లుగా తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తేలింది. 33 జిల్లాల్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ జెప్టో, రిలయన్స్, జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టా మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సహా పలు స్థానిక సముదాయాలపై ఫుడ్సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. 75 యూనిట్లను పరిశీలించి 222 శాంపిళ్లను సేకరించినట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలిపారు. 1,903 కాలం చెల్లిన ఆహార పదార్థాల ప్యాకెట్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.

దాడుల్లో కనిపించిన 76 కిలోల కుళ్లిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు అక్కడే గోదాముల్లో నుంచే బయటకు విసిరి పారేయించారు. మొత్తం 32 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. తాజా సరుకులకు బదులు పాతవి పెట్టి విక్రయిస్తూ జనాలను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అయితే ఇప్పటి వరకు రెస్టారెంట్లు, హోటళ్లలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన తినుబండారాలు, పురుగులు పట్టిన భోజనం ఘటనలు చూశాం. కానీ, ఇప్పుడు కూరగాయలను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలన్నా ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గోదాములపై దాడులు జరగ్గా.. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 25 గోదాముల్లో నాణ్యత లోపం కలవరపెడుతోంది.

ఈ మేరకు నిర్వాహకులను ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దిగ్గజ సంస్థల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం.. ప్రజల ఆరోగ్యంపై వారికున్న బాధ్యతాలేమిని ప్రదర్శిస్తుంది.

