Harish rao house arrest: ఆర్టీసీ సిటీ బస్సు ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ‘చలో బస్ భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో నగరంలోని బస్ స్టాప్ల వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
హరీశ్రావు హౌస్ అరెస్ట్: బీఆర్ఎస్ చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మెహిదీపట్నం బస్టాప్ నుంచి ఉదయం 8:45 గంటలకు బస్సులో బస్ భవన్కు చేరుకోవాల్సిన హరీశ్రావును.. కోకాపేటలోని తన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేటీఆర్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద సైతం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేటీఆర్ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్ స్టాప్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బస్ భవన్కు చేరుకోవాల్సి ఉంది. అయితే కేటీఆర్ను తన నివాసం వద్ద పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/today-hearing-on-bc-reservations-in-high-court-2/
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్కు చేరుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదేనా ప్రజాపాలన?: బీఆర్ఎస్ చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కేటీఆర్తో పాటుగా హరీశ్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ తన అధికార ఎక్స్ స్పందించింది. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు మీద నిరసన తెలుపకుండా రేవంత్ సర్కార్ అణచివేతకు పాల్పడుతోందని పేర్కొంది.
శాంతి భద్రతల నేపథ్యంలో అరెస్టులు: చలో బస్భవన్ కార్యక్రమంలో భాగంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు హరీశ్ రావు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్భవన్ వరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు నగర ప్రజల తరపున వినతిపత్రం సమర్పించాలనుకున్నారు. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


