ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు(Prabhakar Rao) అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత్కు తిరిగిరావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈ నెల 5వ తేదీన సిట్ విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈమేరకు సిట్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీం కోర్టుకు ప్రభాకర్ రావు ఓ అండర్టేకింగ్ లెటర్ను కూడా మెయిల్ ద్వారా పంపారు
కాగా ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలేనని చికిత్స నిమిత్తమే తాను అమెరికా వెళ్లినట్లుగా ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకూడదంటూ ఆదేశించింది. అలాగే ఈనెల 5వ తేదీ లోపు భారత్కు వచ్చి విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.