Saturday, May 18, 2024
HomeతెలంగాణGarla: హరితదారులు స్వాగత తోరణాలు

Garla: హరితదారులు స్వాగత తోరణాలు

పూలదారుల్లో ఆహ్లాదకర ప్రయాణం

గత ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన హరితహార కార్యక్రమం అనేక ఫలితాలను ఇస్తున్నది. హరితహారం ప్రారంభం నుంచి నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఎర్ర పూల వనాన్ని తలపిస్తూ పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. వేసవి సమయంలో ఎక్కడైనా రోడ్డు పక్కన కాస్త నీడన సేద తీరుదామంటే నిలువ నీడ లేకుండా పోయేది. హరితహారంలో నాటిన మొక్కలు ఇప్పుడు నీడతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయి. రోడ్ల వెంబడి మొక్కలు ఏపుగా పెరిగి ఎర్ర పూలు ఆకుపచ్చ తోరణాల మాదిరిగా ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, వాహనదారులు సేదతీరేందుకు చల్లని నీడను ఇస్తున్నాయి.

- Advertisement -

ఓవైపు వేసంగి వరి పంటల నడుమ పచ్చని చెట్లకు పూసిన ఎర్రని పూలు రహదారి వెంబడి వెళ్తున్న వాహనదారులను పాదచారులను చూపరులను విశేషంగా ఆకర్షిస్తూ ఆకట్టుకుంటున్నాయి. గార్ల మండలంలోని ఆయా గ్రామాలు, వెళ్లే రహదారులకు పక్కన పలు విడతల్లో హరిత హారంలో భారీస్థాయిలో మొక్కలను నాటారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకున్నారు. వన సేవలకును నియమించి, నిత్యం నీటిని పోయడంతో ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. గార్ల నుండి సీతంపేట దుబ్బగూడం నుండి ముల్కనూర్ నుండి సత్యనారాయణపురం వరకు వెళ్లే దారిలో పలు విడతల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. గుంపల్లిగూడెం రోడ్డు వెంట మొక్కలను పెంచుతున్నారు. వాటర్‌ట్యాంక్‌ సాయంతో ప్రతి మొక్కకు నీరు పోసి పెంచుతున్నారు.

హరితహారంతో ప్రయోజనం

రోడ్డు పక్కన నాటిన హరితహారం మొక్కలను సంరక్షించడంతో నేడు ఏపుగా పెరిగాయి. దీంతో రోడ్డు వెంట ప్రయాణించేవారికి ఎండలో, వానలో చెట్ల నీడన సేదతీరడంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. పచ్చని మొక్కలు వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. -గంగావత్ లక్ష్మణ్ నాయక్

పచ్చదనంతో ఆహ్లాదం
ప్రభుత్వం చేపట్టిన హరిత హారంలో నాటిన మొక్కలు నేడు పచ్చదనాన్ని పంచుతున్నాయి. రోడ్ల వెంబడి వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు సేద తీర్చుతున్నాయి. నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. -సుందర్, గ్రామస్తుడు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News