Good news for Anganwadi Helpers: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ హెల్పర్లకు శుభవార్త అందించింది. అంగన్ వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచింది.. ఈమేరకు సంబంధితి ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న 4,322 మంది హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి అవకాశం దక్కనుంది.
పదోన్నతి విషయంలో గరిష్ట వయోపరిమితిని పెంచాలని అంగన్ వాడీ హెల్పర్ యూనియన్ల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధింత అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అర్హతలు ఉన్న వారికి 50 ఏళ్ల లోపు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు. ఇటీవల అంగన్ వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో 45 సంవత్సరాలు దాటిన అర్హులకు పదోన్నతి ఇవ్వడంతో ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. ఈమేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ప్రభుత్వం నిర్ణయం పట్ల అంగన్ వాడీ హెల్పర్లు హర్షం వ్యక్తం చేశారు. కాగా గతంలో 45 ఏళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు ఉండేవి కావు.
ఇటీవల రాష్ట్రంలోని అంగన్వాడీలు దేశానికే రోల్మోడల్గా నిలిచేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లలు ఐదేళ్ల వరకు ప్రాథమిక విద్యను అందించాలన్నారు. అనంతరం నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలన్నారు. అంగన్ వాడీలకు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలనే ఉద్దేశంతో నూతన భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇక అంగన్ వాడి భవనాల విషయంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని సూచనలు చేశారు.
పిల్లల అవసరాలకు తగినట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయించాలన్నారు. సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్తో కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయం అవుతుందన్నారు. అలాగే ఎక్కువ సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న కంటైనర్ కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. అంగన్ వాడీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసిన వెంటనే టీచర్లుగా హెల్పర్ల పదోన్నతి వయసు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.