Saturday, October 5, 2024
HomeతెలంగాణMinister Harish Rao: కార్పొరేట్ దవాఖానాలను తలదన్నేల ప్రభుత్వ వైద్యం .. మంత్రి హ‌రీష్‌రావు

Minister Harish Rao: కార్పొరేట్ దవాఖానాలను తలదన్నేల ప్రభుత్వ వైద్యం .. మంత్రి హ‌రీష్‌రావు

Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ద‌వాఖానాల్లో వైద్య సేవ‌ల‌ను త‌ల‌ద‌న్నేలా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మెరుగైన వైద్య‌సేవ‌లు అందిస్తున్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు అన్నారు. మంగళవారం ఆర్మూర్ ఆసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి పనుల గురించి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పేషెంట్లను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో మంత్రి మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న డైట్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు పూటలా భోజనం అందిస్తున్నారా? లేదా? అనే విషయాలను వాకబు చేశారు. రోగులకు తగినటువంటి పోషికాహారం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో ఫార్మసీ లాబ్ సౌకర్యాలు గురించి తెలుసుకున్న మంత్రి హై ఎండ్ అల్ట్రా సౌండ్ మెషిన్ ఉన్నప్పటికీ టిఫా(టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌) స్కానింగ్ మెషిన్ అందుబాటులో లేదని చెప్పగా వెంటనే టిఫా స్కాన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

అదేవిధంగా కిడ్నీ సంబంధిత పేషెంట్లు డయాలసిస్ సౌకర్యం లేనందువలన నిజామాబాద్‌కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి 10 రోజుల్లో ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీలనే చేయాలని మంత్రి వైద్య సిబ్బందికి సూచించారు. ఆర్మూర్ వంద పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ అయిన తరువాత తొలిసారి సందర్శనకు వచ్చిన మంత్రి హరీష్ రావు.. ప్రతీ వార్డుకెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మీపట్ల డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటున్నదని మంత్రి అడగగా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని పలువురు రోగులు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్ష చేసి ఆసుపత్రికి కావాల్సిన తక్షణ సౌకర్యాల పై చర్చించారు.

ఆర్మూర్ దవాఖాన నిర్వహణ అద్భుతంగా ఉందని మంత్రి కితాబు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవ వల్లే ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ అయిందన్నారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ ఆసుపత్రికే తొలి ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక సాంకేతిక వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొంటూ ఫలితంగా ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యాధునిక వైద్యం గ్రామగ్రామానికి చేరువైందన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో మందుల కొరత లేదని, బయట ప్రయివేట్ దుకాణాలకెళ్లి మందులు కొనాల్సిన పరిస్థితి లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఈ ఆస్ప‌త్రిలో 22,670 ఉచిత ప్రసవాలు జరగడం అభినందనీయమన్నారు. ఒక్క నవంబర్ లోనే 310 డెలివరీలు జరిగి ఆ తల్లుల కుటుంబాలకు దాదాపు ఒక కోటిన్నర రూపాయలు ఆదా కావడం హర్షణీయమని మంత్రి ప్రశంసించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ దవాఖానాలను తలదన్నేల ప్రభుత్వ వైద్య రంగాన్ని తీర్చిదిద్దనున్నట్లు హరీష్ రావు ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News