Saturday, November 15, 2025
HomeతెలంగాణCONSUMER ALERT: జీఎస్టీ తగ్గినా.. ధర తగ్గలేదు! పాత రేట్లకే అమ్మకాలు.. దోపిడీపై ఫిర్యాదు చేయండిలా!

CONSUMER ALERT: జీఎస్టీ తగ్గినా.. ధర తగ్గలేదు! పాత రేట్లకే అమ్మకాలు.. దోపిడీపై ఫిర్యాదు చేయండిలా!

Complaint against GST overcharging : ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందని సంబరపడ్డారా? అయితే, ఓసారి మీ బిల్లును జాగ్రత్తగా చూసుకోండి! దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి రావడంతో, సబ్బులు, టూత్‌పేస్టుల నుంచి బట్టల వరకు, దాదాపు 99% వస్తువుల ధరలు అధికారికంగా తగ్గాయి. కానీ, చాలా దుకాణాల్లో, ఈ-కామర్స్ సైట్లలో ఇంకా పాత ధరలకే అమ్మకాలు సాగుతున్నాయని, వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దోపిడీని మీరు కూడా ఎదుర్కొన్నారా? అయితే, ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం, పన్నుల వ్యవస్థను సరళీకరించి, సామాన్యుడిపై భారం తగ్గించేందుకు జీఎస్టీ శ్లాబులను సవరించింది. పాత 5, 12, 18, 28 శాతం శ్లాబుల స్థానంలో, ఇప్పుడు కేవలం 5, 18 శాతం శ్లాబులను మాత్రమే ఉంచింది. దీనివల్ల, అనేక నిత్యావసర వస్తువులపై పన్ను భారం గణనీయంగా తగ్గింది.

ఉదాహరణకు: టూత్‌పేస్టులు, సబ్బులు, బిస్కెట్లపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింది. దీనివల్ల వాటి ధర రూ.3 నుంచి రూ.15 వరకు తగ్గాలి. అలాగే, బట్టలపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింది.

క్షేత్రస్థాయిలో జరుగుతున్నదిదే : ప్రభుత్వం ధరలు తగ్గించినా, ఆ ప్రయోజనం వినియోగదారులకు చేరడం లేదు. చాలామంది దుకాణదారులు, ఆన్‌లైన్ విక్రేతలు పాత ఎమ్మార్పీలకే వస్తువులను అమ్ముతూ, అదనపు లాభాలను ఆర్జిస్తున్నారు.

అమీర్‌పేట వాసి అనుభవం: మెహిదీపట్నంలోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో షాపింగ్ చేసిన ఓ ఉద్యోగికి, బట్టలపై 5% జీఎస్టీకి బదులుగా, 6.2% వసూలు చేశారు.

ఉప్పల్ టెక్కీ నిరాశ: జీఎస్టీ తగ్గాక పాదరక్షల ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, వారం తర్వాత కూడా పాత ధరలే చూసి నిరాశ చెందారు.

దోపిడీపై ఫిర్యాదు చేయండిలా : ఈ సమస్యపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జీఎస్టీ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయని వ్యాపారులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

వాట్సాప్ నంబర్: మీరు మోసపోయినట్లు భావిస్తే, బిల్లుతో సహా వివరాలను 8800001915 అనే వాట్సాప్ నంబర్‌కు పంపించి ఫిర్యాదు చేయవచ్చు.

టోల్‌ఫ్రీ నంబర్: జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ నంబర్లకు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ ఫిర్యాదు: ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో మోసపోయినా, సంబంధిత రశీదు, ఇతర వివరాలతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు ప్రకటించినప్పటికీ, చాలాచోట్ల ఇంకా పాత ధరల దోపిడీ కొనసాగుతూనే ఉంది. వినియోగదారులుగా మనం అప్రమత్తంగా ఉండి, మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad