Saturday, October 5, 2024
HomeతెలంగాణGudema Mahipal: ఇంటింటా సంక్షేమం.. గ్రామ గ్రామాన అభివృద్ధి

Gudema Mahipal: ఇంటింటా సంక్షేమం.. గ్రామ గ్రామాన అభివృద్ధి

బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం చారిత్రాత్మక నిర్ణయం

ప్రతి ఇంటా సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన శుక్రవారం పటాన్చెరు మండలం పాటి గ్రామ చౌరస్తాలోని ప్రైవేటు ఫంక్షన్ హాలులో నియోజకవర్గస్థాయి సంక్షేమ సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, నియోజకవర్గంలోని వివిధ పథకాల లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అన్న ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేసి సకాలంలో డబ్బులు అందిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

ప్రధానంగా నిరుపేదల ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రవేశపెట్టి లక్ష 116 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ పథకం మూలంగా లక్షలాదిమంది ఆడపిల్లల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వీటితోపాటు ఒంటరి మహిళలు, వితంతులు, వృద్ధులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగులకు 2000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు పెన్షన్లు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోందని తెలిపారు. వీటితోపాటు దేశంలోనే మొదటిసారిగా దళితులు ఆర్థిక అభ్యున్నతి కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ పథకం దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

బీసీ వర్గాల లోని కులవృత్తుల సంక్షేమం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టామన్నారు. బ్యాంకుల లింకేజీ లేకుండా నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి జమ చేసి, వారి ఆర్థిక పరిపుష్టికి బాటలు వేస్తోందని తెలిపారు. ప్రతి పేదవాడి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ముగ్గురు లబ్ధిదారులకు చెక్కులు అందజేసి బీసీ కుల వృత్తులకు ఆర్థిక సాయం పథకాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రోజుకు 18 గంటలు కష్టపడుతూ అనునిత్యం అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా లభించడం నియోజకవర్గం ప్రజల అదృష్టం అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ హ్యాట్రిక్ విజయానికి ప్రతి ఒక్కరు సైనికుల వల్ల కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు రోజా బాల్ రెడ్డి, లలిత సోమిరెడ్డి, కార్పొరేటర్లు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ కమిటీల చైర్మన్లు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News