SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) దుబాయ్లో పార్టీలు చేసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం విమర్శలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘మోకాలికి బోడి గుండుకు ముడివేసి మోసగించడం, తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. నా సన్నిహిత మిత్రుడైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతూరి పెళ్లికి అబుదాబి వెళ్లాను. మీ మంత్రిలా క్రికెట్ మ్యాచ్లు చూడటానికి.. విహార యాత్రలకు వెళ్లలేదు. ఘటనా స్థలానికి మంత్రులు వెళ్లకుండా ఎన్నికల ప్రచారానికి హెలికాఫ్టర్ తీసుకెళ్లింది ఎవరు? హెలికాఫ్టర్ లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్లోనే ఉన్నారు. నేను అబుదాబికి వెళ్ళింది ఫిబ్రవరి 21న..ప్రమాదం జరిగింది ఫిబ్రవరి 22న.
మానవ సంబంధాల్లో భాగంగా స్నేహితుని బిడ్డ పెండ్లి ఫంక్షన్కు నేను ఫ్యామిలీతో అబుదాబికి పోతే దానిమీద వక్ర వ్యాఖ్యలు చేస్తూ తమ కుత్సితబుద్ధి బయట పెట్టుకుంటున్నారు. నేను ఎస్ఎల్బీసీకి వెళ్తే అడ్డుకుని ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తారా? ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా మృతదేహాలు వెలికితీయడం చేతకాని ప్రభుత్వం ఇది. నువ్వు దృష్టి పెట్టవలసింది మా ప్రయాణాల మీద కాదు, ప్రజల ప్రయోజనాల మీద. నువ్వు నిరంతరం మామీద నిఘా పెడుతున్నావాంటే అభద్రతలో పడి కొట్టుమిట్టాడుతున్నావని అనుకోవాలి ఇకనైనా బుద్ధి తెచ్చుకో” అని రాసుకొచ్చారు.