సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అనుకున్నాం కానీ ఆయన్ని మించి తాత అయ్యిండు ఉత్తమ్ కుమార్ అని విమర్శించారు. ఉత్తమ్ అబద్దాలు చూస్తే గోబెల్స్ అనేవాడు ఉంటే ఉరి పెట్టుకునేవాడు అని విమర్శించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను స్టే తెచ్చి ఆపిందే బిఆర్ఎస్, కేసీఆర్ అని గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడకు పోయి ఏపీ సీఎం చంద్రబాబును కలిసి బజ్జీలు తిని వచ్చారని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచి ఏం మాట్లాడటం లేదని.. కృష్ణా నది జలాల్లో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు వాడనంత తక్కువ నీళ్లు వాడింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. ఆంధ్రాకు దాసోహం చేసి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్లో పంటలను ఎండబెట్టిందని ఆరోపించారు. తాత్కాలిక కేటాయింపుల ప్రకారం, 65 టీఎంసీలు తక్కువ వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వమన్నారు.
గోదావరి బనకచర్ల మీద ప్రిపేర్ కాలేదు అంటున్నడు ఉత్తమ్. నీటి పారుదల శాఖ మంత్రిగా నువ్వు ఎంతో బాధ్యత రాహిత్యంగా ఉన్నావు. స్టడీ చేయలేదని మాట్లాడటం నిర్లక్ష్యం. కేబినెట్లో బనకచర్ల గురించి మాట్లాడేందుకు సమయం లేదా? ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటదా? ఐదు గంటలు కమిషన్లు, పర్సెంటీజీలు, హైకమాండ్కు పంపే మూటల గురించి మాట్లాడారా? 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఏపీ తరలిస్తుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా? సుప్రీం కోర్టుకు వెళ్లరా, కేంద్ర మంత్రిని కలవరా, నీతి అయోగ్లో సీఎం ఎందుకు మాట్లాడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.
అపెక్స్ కమిటి అనుమతి లేకుండా, అంతర్ రాష్ట్ర అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ప్రాజెక్టు కడుతుంటే ఎందుకు మౌనం. చంద్రబాబును ఎదురించే దమ్ము సత్తా లేదా, ఎందుకు లాగులు తడుస్తున్నాయి. ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్లరు, ఎందుకు ప్రధానిని ప్రశ్నించరు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ఏపీకి దాసోహం అయిపోయారు. రాష్ట్రం స్పందించకుంటే సుప్రీం కోర్టుకు బిఆర్ఎస్ వెళ్తుందని చెప్పినం. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బిజేపీ పెదవి విప్పడం లేదు. గోదావరి బనకచర్ల మీద బిజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు బిజేపికి పట్టవా? బనకచర్ల ద్వారా తెలంగాణ గోదావరిలో వాటా కోల్పోయే పరిస్థితి? శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పూర్తి అయితే రోజుకు 90వేల క్యూసెక్కుల చొప్పున తరలిస్తారు. బిజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కండ్లు తెరవండి. ఏపీ నీటి దోపిడిని అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నది. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ అక్రమ పనులు ఆపడం లేదు? గోదావరి బనకచర్ల అక్రమ ప్రాజెక్టును ఆపడం లేదు? అని నిలదీశారు.
గంధమల్ల ప్రాజెక్టు అంటే కాళేశ్వరంలో అంతర్భాగం. కాళేశ్వరం కూలితే గంధమల్లకు నీళ్లు ఎలా వస్తాయి రేవంత్ రెడ్డి. గంధమల్లకు ఎట్ల కొబ్బరి కాయ కొడుతున్నవు. గంధమల్ల, మల్లన్నసాగర్, రంగనాయర్ సాగర్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి.. ఇదంతా కాళేశ్వరం కాదా రేవంత్ రెడ్డి. కుప్పకూలింది అని ప్రచారం చేసావు. కాళేశ్వరం కూలితే గంధమల్లకు గోదావరి జిలాలు ఎట్ల వస్తాయి. నువ్వు ఇన్ని రోజులు చేసిన ప్రచారం శుద్ద తప్పు అని తేటతెల్లమైంది. నువ్వు చేసింది అదంతా గోబెల్స్ ప్రచారం మూసీలో గోదావరి నీళ్లు పోస్తా అంటవు, ఎట్ల సాద్యమైతది రేవంత్ రెడ్డి? అని హరీశ్రావు ప్రశ్నించారు.