సీఎం రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
“ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇవాళ ఏప్రిల్ 1వ తేదీ రానే వచ్చింది. ఇంతవరకూ రైతుభరోసా ఊసేలేదు. రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే, చేతలు హీనంగా ఉన్నాయని మండిపడ్డారు. మాటలు కోటలు దాటితే అడుగు గడప దాటడం లేదు.
ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైంది. రైతులను ఇంకెన్ని సార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి. దసరాకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. సంక్రాంతికి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. ఉగాదికి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ.. రేవంత్ నోట మాట మాత్రం మారడం లేదు. కొత్త సంవత్సరం రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేదు అనుభవాన్ని మిగిల్చింది.
నాట్ల సమయంలో కేసీఆర్ రైతు బంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వడం లేదు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నాడు.
రుణమాఫీని దారుణ వంచనగా మార్చిండు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడటం లేదు. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప, రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు, అసెంబ్లీలో ప్రకటించినట్లు రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా, రైతు భరోసా ఇచ్చే దాకా నిన్ను బీఆర్ఎస్ పార్టీ వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడిక్కడ నిలదీస్తూ, మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు.