తెలంగాణ ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటీవోలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ప్రశ్నించారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
“దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటివోలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం. పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి, వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయం. కొండంత సంతోషంతో హైదరాబాద్కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతున్నది.
పెళ్ళి పేరు చెప్పి, పదో తరగతి ఫలితాలు వాయిదా వేయడం. పూటకో కారణం చెబుతూ, నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రచార ఆర్భాటం పక్కన బెట్టి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియమక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లో ప్రతిభ చాటి, ఏఈ, జెటివో లుగా నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.