Sunday, June 22, 2025
HomeతెలంగాణHarish Rao: 6 డిమాండ్లతో మంత్రి సీతక్కకు హరీశ్ రావు లేఖ

Harish Rao: 6 డిమాండ్లతో మంత్రి సీతక్కకు హరీశ్ రావు లేఖ


Harish Rao wrote a letter to Minister Seetakka: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వార్తల నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై లేఖలో పేర్కొన్నారు. గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి అందులో ప్రస్తావించారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని గుర్తుచేశారు. అలాగే గ్రామ పంచాయతీలకు సకాలంలో ఇచ్చిన నిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారుల కృషి వల్ల తెలంగాణ గ్రామాలు అభివృద్దిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారాయన్నారు. నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ది ఎక్కడిక్కడే నిలిచిపోయిందన్నారు. పారిశుద్ద్యం పడకేయడంతో పాటు వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో చిక్కుకున్నాయని వివరించారు. చివరకు గత ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లలో కూడా డీజిల్ పోయించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్టీఏ టాక్స్ కట్టలేక అధికారులకు తాళాలు అప్పగిస్తున్న దుస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినప్పటికీ పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహణ కొనసాగించే ప్రయత్నం చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అప్పులు పెరగడంతో పాటు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం మరింత పెరిగిందన్నారు. దీంతో వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తే సమీపిస్తే నిధులు విడుదల మరింత కష్టతరం అవుతుందన్నారు. ఈలోపే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు 6 డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు.

గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. గతంలో చేసిన పనులకు మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలన్నారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవులు నిర్వహించి, పారిశుద్ద్యం పెంపొందించాలని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వెంటనే వారికి వేతనాలు చెల్లించాలన్నారు. గతేడాది నవంబర్ లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. వెంటనే వారి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News