Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల సెప్టెంబర్ 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. 28న అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.
ఏపీలో అల్పపీడన ప్రభావం: ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో అప్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సైతం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/moderate-rains-forecast-for-telugu-states/
తెలంగాణలో అల్పపీడన ప్రభావం: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావం కారణంగా ఈ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఆదివారం కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. సోమవారం సైతం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


