Indian Railways lower berth booking for senior citizens : రైలు ప్రయాణం అనగానే ఓవైపు సంతోషం, మరోవైపు చిన్న ఆందోళన. ముఖ్యంగా ఇంట్లో వృద్ధులు, గర్భిణులతో ప్రయాణిస్తున్నప్పుడు, వారికి పొరపాటున పై బెర్త్ వస్తే ఎలా అనే బెంగ చాలామందిని పట్టిపీడిస్తుంది. ఆయాసపడుతూ వారు ఎక్కిదిగడం కష్టమే కదా! అయితే, ఇకపై ఆ చింత అవసరం లేదు. వృద్ధులు, గర్భిణుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ప్రత్యేక నిబంధనలను, సౌకర్యాలను అందిస్తోంది. అసలు ఆ లోయర్ బెర్త్ను ఖచ్చితంగా ఎలా పొందాలి…? టికెట్ బుక్ చేసేటప్పుడు పాటించాల్సిన చిట్కాలేంటి..?
రైలు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, 45 ఏళ్లు పైబడిన మహిళల కోసం రైల్వే శాఖ పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టికెట్ రిజర్వేషన్ నుంచి స్టేషన్లో కాలుపెట్టే వరకు వారికి అండగా నిలుస్తోంది. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
లోయర్ బెర్త్ కోసం ప్రత్యేక కోటా: రిజర్వేషన్ బోగీలలో సీనియర్ సిటిజన్లు, అర్హులైన మహిళలకు బెర్తుల కేటాయింపులో ప్రత్యేక కోటా విధానం అమల్లో ఉంది.
అర్హులు: 60 సంవత్సరాలు పైబడిన పురుషులు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణులు ఈ కోటా కిందకు వస్తారు.
బుకింగ్ విధానం: ఆన్లైన్లో లేదా కౌంటర్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుల సరైన వయసును నమోదు చేయాలి. అనంతరం, అక్కడ కనిపించే ఆప్షన్లలో “లోయర్ బెర్త్ కోటా” (Lower Berth Quota)ను ఎంచుకోవాలి (టిక్ చేయాలి). సీట్ల లభ్యతను బట్టి వ్యవస్థ ఆటోమేటిక్గా మీకు లోయర్ బెర్త్ను కేటాయిస్తుంది.
ఏ క్లాస్లో ఎన్ని బెర్తులు కేటాయిస్తారు : ఈ ప్రత్యేక కోటా కింద ప్రతి కోచ్లో కొన్ని లోయర్ బెర్త్లను కేటాయిస్తారు.
స్లీపర్ క్లాస్: ప్రతి కోచ్లో 6 నుంచి 7 లోయర్ బెర్త్లు.
ఏసీ త్రీటైర్ (3AC): ప్రతి కోచ్లో 4 నుంచి 5 లోయర్ బెర్తులు.
ఏసీ టూ-టైర్ (2AC): ప్రతి కోచ్లో 3 నుంచి 4 లోయర్ బెర్తులు.
స్టేషన్లోనూ ప్రత్యేక సౌకర్యాలు: ప్రయాణికులు రైలు ఎక్కే వరకు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది.
వీల్చైర్లు: సికింద్రాబాద్, కాచిగూడ సహా దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో వీల్చైర్లు అందుబాటులో ఉంటాయి. స్టేషన్లోని టీటీఈ లేదా స్టేషన్ మాస్టర్కు సమాచారం ఇచ్చి వీటిని ఉచితంగా వినియోగించుకోవచ్చు. లైసెన్స్డ్ కూలీలు (పోర్టర్లు) కూడా రుసుము చెల్లిస్తే ఈ సేవలు అందిస్తారు.
బ్యాటరీ కార్లు: సికింద్రాబాద్ వంటి పెద్ద స్టేషన్లలో వృద్ధులు, గర్భిణులు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీ వరకు చేరుకునేందుకు బ్యాటరీ కార్లు అందుబాటులో ఉన్నాయి.
లిఫ్టులు, ఎస్కలేటర్లు: ఒక ప్లాట్ఫాం నుంచి మరోదానికి వెళ్లేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 119 స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు.
ప్రయాణంలో ఇబ్బంది ఎదురైతే : రైలు ప్రయాణ సమయంలో సీటు బాగోలేకపోయినా, కోచ్ అపరిశుభ్రంగా ఉన్నా, ఏసీ పనిచేయకపోయినా, ఆహారం నాణ్యత సరిగా లేకపోయినా ప్రయాణికులు ఫిర్యాదు చేసే హక్కు ఉంది. అలాగే, సరైన టికెట్ ఉన్న ప్రయాణికుడిని కోచ్ నుంచి బయటకు పంపే అధికారం టీటీఈకి కూడా లేదు. ఎలాంటి అసౌకర్యం ఎదురైనా వెంటనే రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కి కాల్ చేయవచ్చు లేదా ‘రైల్ మదద్’ యాప్ ద్వారా నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.


