Friday, September 20, 2024
HomeతెలంగాణHuzurabad: ప్రజారోగ్యంతో చెలగాటం

Huzurabad: ప్రజారోగ్యంతో చెలగాటం

పట్టించుకోని అధికారులు

ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు కల్తీ వస్తువులను మార్కెట్లో నింపేస్తున్నారు. ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆహార పదార్థాల కల్తీ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. అక్రమార్కులు ఉప్పు, పప్పులు, బియ్యం, గోధుమలు, నూనెలు ఇలా అన్నీ కల్తీ చేస్తున్నారు. ఆహార పరిరక్షణ శాఖ సిబ్బంది పట్టించు కోకపోవడంతో కల్తీ సరుకులకు అడ్డుకట్టే లేకుండా పోతోంది. ప్రధానంగా వంట నూనెలు, పాలు, పెరుగు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, టీ పౌడర్‌, ఐస్‌ క్రీమ్‌లను కల్తీ చేసి అమ్ముతున్నారు. హోటళ్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ తయారీకి ఉపయోగించే నూనెలు, పిండి, మసాలాలు తదితర వస్తువులు చాలా మట్టుకు కల్తీవే. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు చిరు వ్యాపారులు కల్తీ సరుకులను విరివిగా వాడుతుంటారు. స్థానికంగా ప్యాక్‌ చేసి అమ్మే కొన్ని వస్తువులు, పదార్థాలు ఎక్కడ, ఎవరు, ఎప్పుడు తయారు చేస్తున్నారో కూడా తెలియడం లేదు. కానీ మార్కెట్‌లో మాత్రం యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న కల్తీ పదార్థాల తయారీపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
ప్రజలు అభిరుచిని సొమ్ము చేసుకునేందుకు..
ఈ మధ్య కాలంలో ప్రజలు బయట హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, టిఫిన్‌ సెంటర్లలో తినేందుకు మక్కువ చూపుతుండడంతో ఇదే అదునుగా కొందరు వ్యాపారులు టేస్ట్‌గా చేస్తే చాలు.. వాడే వస్తువులు ఏవైతే నేం…? అనే ధోరణితో కల్తీ వస్తువులను వాడుతున్నారు. చిన్నచిన్న హోటళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, తోపుడు బండ్లపై తినుబండారాలు, మిక్చర్‌ పాయింట్లు తదితర చోట్ల కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ప్రధానంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో నాసిరకం/కల్తీ వస్తువులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన అధికారులు తనిఖీలు చేయడం లేదు.

- Advertisement -

ఆహార భద్రత అధికారుల పర్యవేక్షణ కరువు
హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలలో కల్తీ ఆహారం రాజ్యమేలుతోంది. నిల్వ ఉంచిన ఆహారాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంపై దెబ్బతీస్తున్న విక్రయదారులపై అధికారులు చర్యలు శూన్యం అనిపిస్తుంది. కల్తీ ఆహారాలు విక్రయం జరగకుండా తీసుకోవాల్సిన అధికారులే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే కల్తీ రాకెట్లు రెచ్చిపోతున్నారు. ఆహార భద్రత అధికారులు ఒక్కొక్కరు వారి పరిధిలో నిర్ణీత సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యవసరాల్లో వాటి నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు నమూనాలను సేకరించాలి. సేకరించిన నమూనాలను ల్యాబ్‌లకు పంపించి వచ్చిన ఫలితాలు ఆధారంగా విక్రయదారులపై చర్యలు తీసుకోవాలి. అయితే ఈ తీరు ఆచరణలో మాత్రం శూన్యం అనిపిస్తుంది. పర్యవేక్షించాల్సిన అధికారులే పట్టించుకోకుండా ఉండే సరికి పట్టణంలో పలు రెస్టారెంట్లు, భోజన హోటల్లు, టిఫిన్ హోటళ్లకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంటే వీటిపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News