Thursday, October 3, 2024
HomeతెలంగాణHuzurabad: కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్

Huzurabad: కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్

రైతన్నలు కాంగ్రెస్ కుట్రలను గమనించాలి

రైతుబంధుపై కాంగ్రెస్‌ ద్వంద వైఖరి అలంబిస్తుందని, పథకాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాయడం హేయమైన చర్య అని, కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్ పార్టీ అని, రైతన్నలు కాంగ్రెస్ కుట్రలను గమనించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట మునగడం ఖాయం అని అన్నారు. కరోనా విపత్తులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రైతుబంధు ఆగనివ్వలేదన్నారు. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతున్నా తెలంగాణలో ఏడు వేల పైచిలుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కోసం ఆన్ గోయింగ్ పథకాన్ని ఆపాలంటూ ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందని మండిపడ్డారు.
అధికారం మీద తప్ప కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద గానీ, వ్యవసాయం మీద గానీ ప్రేమ లేదన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్నామని, కరువుతో అల్లాడి అంబలి కేంద్రాల కోసం ఎదురుచూశామన్నారు. పచ్చగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలు, కరెంటు కోతలు, వలసలకు నిలయమైందని అన్నారు. అధికారం కోసం కర్ణాటకలో అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు నెలలు కాకముందే చేతులు ఎత్తేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఇప్పుడు రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్ అనైతికతకు నిదర్శనంగా చెప్పవచ్చన్నారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మ లను దహనం చేశామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News