Tuesday, September 17, 2024
HomeతెలంగాణHyd: రెండేళ్లలో నల్గొండ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి

Hyd: రెండేళ్లలో నల్గొండ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి

ఇరిగేషన్ సమీక్షలో అధికారులకు ఆదేశాలు


నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సాగునీటిపారుదల శాఖామాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇద్దరు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

గత ప్రభుత్వంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మెజారిటీ పనులు పూర్తయిన SLBC ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉంది. జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు సాగునీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం జిల్లా ప్రజల అదృష్టమని ఆయన అన్నారు.

సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం బ్రహ్మణవెల్లముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కెనాల్స్ తో పాటు, పెండింగ్ లో ఉన్న SLBC టన్నెల్ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టి పూర్తి చేయాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే SLBC కాలువలను పూర్తిచేసినప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు. SLBC కాలువలకు మరియు వరద కాలువకు గత 10 సంవత్సరాల నుంచి మొయింటెనెన్స్ లేకపోవడంతో చెట్లు, పూడిక పెరిగింది.. వీటికి మరమ్మత్తులు చేపట్టాలి, బెడ్ మరియు సైడ్స్ లైనింగ్ పనులను ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఉదయ సముద్రం ప్రాజెక్టు క్రింద మొదటిదశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు భూసేకరణ చేపట్టడం, కాలువలను తవ్వే పనులను పూర్తి చేసి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గౌరవ ముఖ్యమంత్రిగారు నల్గొండ జిల్లా ప్రాజెక్టుల పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు కావల్సిన సహాకారం అందిస్తామని వారు చెప్పారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు సుమారు 100 కోట్లు మరియు పనులకు గాను మరో 100 కోట్లను త్వరితగతిన విడుదల చేస్తామని, అధికారులు అవిశ్రాంతంగా శ్రమించి యేడాదిలో మొదటి దశను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రిలిద్దరు అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్ సీ మురళీధర్ రావు, ఛీఫ్ ఇంజనీరు అజయ్ కుమార్, డిప్యూటీ ఈఎన్ సీ జనరల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News