Saturday, October 5, 2024
HomeతెలంగాణHyd: ఎట్టకేలకు ప్రారంభం కానున్న కొత్త సచివాలయం

Hyd: ఎట్టకేలకు ప్రారంభం కానున్న కొత్త సచివాలయం

తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమవుతున్న సచివాలయం భవన నిర్మాణాలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం, డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్షించారు. ఎలివేషన్ పనులను, ఫౌంటేన్, గ్రీన్ లాన్, టూంబ్ నిర్మాణం దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్ డిజైన్ వర్కు తదితర పనుల పురోగతిని పరిశీలించారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, భోపాల్ నుంచి ప్రత్యేకంగా ఉడ్ కార్వింగ్ చేసి తెప్పించి అమర్చిన ద్వారాన్ని చూసి సిఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.
సిఎం పేషీ ఉండే ఆరవ అంతస్తుకు వెళ్లి..చాంబర్ లో ఏర్పాటు చేసిన టేబుళ్లు, కుర్చీలు తదితర ఫర్నీచర్ ను పరిశీలించారు. గత పర్యటన సందర్భంగా సిఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు వాల్ క్లాడింగ్, డెకరేషన్ తదితర తుదిమెరుగులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లని రంగుతో కూడిన గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, గోడల రంగుతో సరిపోయే విధంగా వేసిన మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు, అంతే అందంగా తీర్చిదిద్దిన చాంబర్ల ద్వారాల పనితీరును పరిశీలించి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను, వర్క్ ఏజెన్సీ అధికారులను సిఎం అభినందించారు.

- Advertisement -

నలుమూలలా కలియ తిరిగిన సిఎం కేసీఆర్ సిఎం కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. జీఏడి ప్రోటోకాల్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను సిఎం పరిశీలించారు. కలెక్టర్ల కాన్పరెన్స్ హాల్., ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ లాంజ్, విఐపీల వెయిటింగ్ లాంజ్ లను సిఎం పరిశీలించారు.
అనంతరం గ్రౌండు ఫ్లోర్ కు చేరుకున్న సిఎం, దక్షిణ భాగం గుండా నడుచుకుంటూ అక్కడ నిర్మాణంలో వున్న పార్కింగ్ తదితర పనులను పరిశీలించారు. అనంతరం సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పనుల పురోగతిని సిఎం పరిశీలించారు. తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణం పనులు పూర్తికావచ్చినందుకు సిఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయం నుంచి నిర్మాణంలో వున్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు.
అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న సిఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం బేస్ లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్ళను ఆడియో విజువల్ ప్రదర్శనకోసం నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ తదితర పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను, వర్క్ ఏజెన్సీలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అక్కడినుంచి తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం, లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ గారితో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్; ఎమ్మెల్యేలు విప్ బాల్క సుమన్, ఎ. జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రోడ్లు భవనాలు శాఖ అధికారులు శ్రీనివాస్ రాజు, గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులున్నారు.

ఏప్రిల్ 30న కొత్త సెక్రెటేరియట్ ప్రారంభించే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News