Sunday, September 22, 2024
HomeతెలంగాణHyd: మంత్రి సత్యవతి చేతిపై కేసీఆర్ పచ్చ బొట్టు

Hyd: మంత్రి సత్యవతి చేతిపై కేసీఆర్ పచ్చ బొట్టు

కొమురం భీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి పచ్చబొట్టు వేశారని తెలుసుకుని మంత్రి ఆనందించారు

సిఎం కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంతరించి పోతున్న గిరిజన సాంస్కృతులను ప్రోత్సాహించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా శనివారం బంజారహిల్స్ లోని బంజారా భవన్ లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆదివాసి, బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. గిరిజన స్టాల్స్ ను సందర్శిస్తున్న మంత్రికి అక్కడ స్టాల్స్ నిర్వాహకులు వాటి ప్రత్యేకతలను వివరించారు. అదే సమయంలో పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై సిఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని సూచించారు. నిర్వాకులు పచ్చబొట్టు నొప్పితో కూడినది అని చెప్పినా మంత్రి కేసీఆర్ పేరును వేయాలని వారికి తెలిపారు. నొప్పిని భరిస్తూ సిఎం కేసీఆర్ పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు. కొమురం భీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రికి పచ్చబొట్టు వేశారని తెలుసుకుని మంత్రి ఆనందించారు. పచ్చబొట్టు వేసినందుకు నగదు బహుమానం అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరిగిందన్నారు. దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. గిరిజన ఆరాధ్య దైవం అయిన కేసీఆర్ పోడు భూములకు పట్టాలు, తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో పాటు, రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాలు, గిరిజన రిజర్వేషన్ 10శాతం పెంచి మా గిరిజన జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. గిరిజనులు వృద్ధిలోకి వచ్చే విధంగా గిరిజన విద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన భోజనం సౌకర్యాలతో పాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తున్నారని చెప్పారు. అంతరించిపోతున్న గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు సిఎం కేసీఆర్ పాలనలో పెద్దపేట వేసి వాటిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గిరిజన సంక్షేమానికి రూ.6వేల కోట్లు ఖర్చు పెడితే, కెసిఆర్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో గిరిజన సంక్షేమానికి 53 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అంటే కెసిఆర్ కి గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. 75 ఏండ్లలో జరుగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. బంజారాలు, ఆదివాసీలపైన వరాల జల్లు కురిపించిన కేసీఆర్ కి తాము జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో గిరిజన సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రై కార్ చైర్మన్ రామచంద్రునాయక్ జిసిసి చైర్మన్ వాల్యా నాయక్, బంజారా సేవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ్ లాలా నాయక్, ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్, బీఆర్ ఎస్ నాయకులు రామవత్ విష్ణు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News