Police crackdown on iBOMMA piracy : కొత్త సినిమా విడుదలైతే చాలు, థియేటర్ కంటే ముందే ఫోన్లలో ప్రత్యక్షమయ్యే ‘ఐ-బొమ్మ’ వెబ్సైట్కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉచ్చు బిగించారు. సినిమా, ఓటీటీ పరిశ్రమలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ పైరసీ భూతంపై పోలీసులు దృష్టి సారించడంతో, ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతూ ఆ సైట్ నిర్వాహకులు ఓ సంచలన ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పైరసీ ముఠా ఎలా పనిచేస్తోంది? పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన షాకింగ్ నిజాలేంటి..?
సినిమా పరిశ్రమకు ఏటా వేల కోట్ల నష్టాన్ని మిగులుస్తున్న పైరసీపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల, దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను ఛేదించి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తు క్రమంలోనే, తెలుగు ఓటీటీ కంటెంట్ను విచ్చలవిడిగా పైరసీ చేస్తున్న ‘ఐ-బొమ్మ’పై పోలీసులు దృష్టి పెట్టారు.
నలుగురు ఏజెంట్ల అరెస్ట్: పోలీసుల దర్యాప్తును సవాల్ చేస్తూ ‘ఐ-బొమ్మ’ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేయడంతో, పోలీసులు దీనిని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న నలుగురు కీలక ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ కేంద్రంగా వీరు పనిచేస్తున్నట్లు గుర్తించారు.
పైరసీ ముఠాల పనితీరు.. అత్యాధునిక పద్ధతులు : ఈ ముఠాలు అత్యాధునిక పద్ధతుల్లో పైరసీకి పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సర్వర్ల హ్యాకింగ్: కొన్నిసార్లు, థియేటర్లలో ప్రదర్శన కోసం ఉపయోగించే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్వర్డ్లను క్రాక్ చేసి, నేరుగా ఒరిజినల్ కంటెంట్నే తస్కరిస్తున్నారు.
థియేటర్లలో రహస్య రికార్డింగ్: సర్వర్లను హ్యాక్ చేయడం కుదరని పక్షంలో, తమ ఏజెంట్లకు అత్యాధునిక కెమెరాలను అందించి, థియేటర్లలో రహస్యంగా రికార్డు చేయిస్తున్నారు. చొక్కా జేబులు, పాప్కార్న్ డబ్బాలు, కూల్ డ్రింక్ టిన్లలో కెమెరాలను అమర్చి, అత్యంత చాకచక్యంగా సినిమాను చిత్రీకరిస్తున్నారు.
క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు: ఈ ఏజెంట్లకు కమీషన్లను క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లిస్తూ, తమ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ముఠాల కార్యకలాపాలు నెదర్లాండ్, దుబాయ్, మయన్మార్ వంటి దేశాల నుంచి కూడా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
‘ఐ-బొమ్మ’ ప్రకటనతో కలకలం : పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో, ‘ఐ-బొమ్మ’ నిర్వాహకుల నుంచి ఓ ప్రకటన వెలువడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో, తమ సేవలను కొనసాగిస్తామని, తెలుగు వారి కోసమే పనిచేస్తామని చెప్పడం, వారి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారని, త్వరలోనే ప్రధాన సూత్రధారులను కూడా పట్టుకుంటామని సైబర్ క్రైమ్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


