మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా అనే అంశంపై మాస్టర్ క్లాస్ సెమినార్ కేఎల్ యూనివర్సిటీలో విజయవంతంగా సాగింది. హైదరాబాద్ అజీజ్ నగర్ లోని కేఎల్ విశ్వవిద్యాలయంలో యూపీఎస్సీలో మాస్టర్ క్లాస్ అనే అంశంపైన సందేహాలను తీర్చేలా ఈ వర్క్ షాప్ నిర్వహించారు. హైదరాబాద్లోని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ విద్యార్థులతో మాట్లాడుతూ సమాజం పట్ల అంకితభావం, ఇష్టంతో పనిచేసినప్పుడు ప్రకృతి కూడా మంచిపనికి మద్దతిస్తుందని సివిల్స్ లో అర్హత సాధించడం ద్వారా సమాజానికి మంచి చేయడం సాధ్యమవుతుందన్నారు.
మిరాకిల్ మ్యానే ప్రత్యక్ష ఉదాహరణ
తన వ్యక్తిగత నిధులు, ప్రజా సహకారాలను ఉపయోగించి మణిపూర్లోని మారుమూల ప్రాంతంలో 100 కిలోమీటర్ల రహదారి నిర్మించిన మిరాకిల్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన ఆర్మ్స్ట్రాంగ్ పేమ్, ఐఏఎస్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఉదాహరణగా చెబుతూ ప్రతి విద్యార్థి ఆయనలా ఆలోచించాలని కృష్ణ ప్రదీప్ అన్నారు. ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు సివిల్స్ ఎలా ప్రిపేర్ కావాలి, దీన్ని ఎలా బాలన్స్ చేసుకోవాలో విద్యార్థులకు వివరించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/4edb0371-f038-45f0-a193-823b3bc31719-1024x576.jpg)
స్టూడెంట్ ప్రోగ్రెషన్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ బి. రవి, స్టూడెంట్ ప్రోగ్రెషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ & కోఆర్డినేటర్ డాక్టర్ సుభ్రాంగీనీ దాస్, వింగ్స్ మీడియా, G-5 మీడియా నుండి గిరి ప్రకాష్, గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.