Formula E car race: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కొన్ని అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా ఈ-కార్ రేసులో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే రెండు సార్లు ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. ఈ కేసులో తనను అన్యాయంగా ప్రభుత్వం ఇరికిస్తోందని.. తప్పుడు కేసులతో అరెస్ట్ చేసేందుకు చూస్తోందని ఆరోపించారు.
తాజాగా ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్, హెచ్ఎండీఐ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అర్వింద్ను విచారిస్తున్నట్లు సమాచారం. విచారణలో ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అర్వింద్ వాంగ్మూలం కీలకం కానుంది. మరి ఆయన విచారణ తర్వాత ఎలాంటి కీలక పరిణామాలు జరుగుతాయో చూడాలి. వాస్తవంగా గతంలోనే అర్వింద్ కుమార్ను విచారించాలి. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉండటంతో వాయిదా పడింది. తాజాగా విదేశాలు నుంచి తిరిగి రావడంతో విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులు పంపించారు. దీంతో ఆయన ఇవాళ హైదరాబాద్లోని ఏసీబీ కార్యాయంలో విచారణకు హాజరయ్యారు.
కాగా హైదరాబాద్లో 2023లో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించిన విషయం విధితమే. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థకు సొమ్ము రూ.54.88 కోట్లు చెల్లించారంటూ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎందుకు నిధులు కోసం ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. మంత్రివర్గం ఆమోదం లేకుండా వచ్చే మూడేళ్లలో రేసుల నిర్వహణకు రూ.600కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదర్చుకోవడంపై దర్యాప్తు చేస్తోంది.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే తాము నిధులు విడుదల చేసినట్లు ఆ సమయంలో హెచ్ఎండీఏ కమిషనర్గా కొనసాగిన అర్వింద్ కుమార్ ప్రభుత్వానికి లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. అయితే కాకుండా గత విచారణలో కూడా అధికారుల ముందు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మరోసారి విచారణకు హాజరు అయిన నేపథ్యంలో ఆయన అప్రూవర్గా మారి ప్రభుత్వానికి సహకరిస్తారో లేక తనకేమీ తెలియదని చెబుతారా తేలాల్సి ఉంది. అర్వింద్ కుమార్ వాంగ్మూలం ఆధాకారం అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.