India Post mobile app features : గంటల తరబడి క్యూలో నిలబడటం, చిన్న పనికి కూడా పోస్టాఫీసుకు వెళ్లాల్సిన శ్రమ.. వీటన్నింటికీ తపాలా శాఖ స్వస్తి పలుకుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, ప్రజలకు తమ సేవలను మరింత చేరువ చేసేందుకు విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. “ఇక పోస్టాఫీస్ మీ జేబులోనే” అంటూ ‘డాక్ సేవ’ పేరుతో సరికొత్త మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ఇంతకీ ఈ యాప్లో ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి? దాన్ని ఎలా ఉపయోగించాలి? పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.
అరచేతిలో అన్నీ సేవలు : తపాలా శాఖ అందించే దాదాపు అన్ని సేవలను ఈ ‘డాక్ సేవ’ యాప్ ద్వారా పొందవచ్చు. ఇకపై స్పీడ్పోస్ట్ బుకింగ్ కోసమో, పార్సిల్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసమో పోస్టాఫీసు వరకు వెళ్లాల్సిన పనిలేదు.
ట్రాకింగ్ చాలా సులభం: మీ పార్సిల్, మనీ ఆర్డర్, లేదా స్పీడ్పోస్ట్ ఎక్కడుందో రియల్ టైమ్లో క్షణాల్లో తెలుసుకోవచ్చు.
ఛార్జీల లెక్కింపు: దేశీయ, అంతర్జాతీయ పార్సిల్ సేవలకు ఎంత ఖర్చవుతుందో యాప్లోనే వెంటనే లెక్కించుకోవచ్చు.
లైన్లతో పనిలేదు: స్పీడ్పోస్ట్, రిజిస్టర్డ్ పోస్టు, పార్సిల్ బుకింగ్ వంటి సేవలను యాప్ ద్వారానే పూర్తిచేసి, గంటల తరబడి క్యూలలో నిలబడే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఇతర సేవలు: ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, ఫిర్యాదుల నమోదు వంటి అనేక ఇతర సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
సమీప పోస్టాఫీస్: జీపీఎస్ సహాయంతో మీకు దగ్గర్లో ఉన్న పోస్టాఫీసు చిరునామా, వివరాలను సులభంగా కనుగొనవచ్చు.
యాప్ను పొందడం ఎలా : ఈ ‘డాక్ సేవ’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ను ఓపెన్ చేసి, మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకుని, ఓటీపీ ద్వారా లాగిన్ అయితే చాలు. తపాలా శాఖ సేవలు మీ వేళ్ల కొనపై సిద్ధంగా ఉంటాయి.
శతాబ్దాల సేవ.. నేడు డిజిటల్ వైపు : భారతదేశంలో 1854లో లార్డ్ డల్హౌసీ హయాంలో ప్రారంభమైన తపాలా సేవలు, నేడు దేశ నలుమూలలకూ విస్తరించాయి. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 1.65 లక్షల పోస్టాఫీసులు ఉండగా, వాటిలో 90 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయి. తెలంగాణలో సుమారు 6,305 పోస్టాఫీసులు ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వమే 1869లో సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో తొలి హెడ్ పోస్టాఫీసు ఏర్పాటైంది. అంతటి ఘన చరిత్ర కలిగిన తపాలా శాఖ, నేడు ‘డాక్ సేవ’ యాప్తో డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టి, ప్రజలకు మరింత చేరువవుతోంది.


