Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నామినేషన్ దాఖలు గడువు ముగియగానే.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సెన్సేషనల్ ఆరోపణలు నమోదయ్యాయి. మాగంటి గోపినాథ్ తన భార్య మాలినీదేవికి విడాకులు ఇవ్వలేదని.. ఇప్పటికీ మా అమ్మ మాగంటి గోపినాథ్ భార్యనేనని మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న అన్నారు. అలాంటపుడు సునీత గోపినాథ్ కు భార్య ఎలా అవుతుందని ప్రశ్నించాడు. తన తండ్రి సునీతను పెళ్లి చేసుకోలేదని అన్నారు. కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనే ఉన్నారని ఆరోపించారు. తన తండ్రికి అసలైన వారసుడిని తానేనని తారక్ ప్రద్యుమ్న అన్నారు.
నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్: న్యాయబద్దంగా ఎమ్మెల్యే టిక్కెట్టు తన తల్లికి రావాలని అన్నారు. సునీత తన అనుచరులతో తమని బెదిరించారని తెలిపారు. వెంటనే ఆమె నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఆ లేఖలో తన తల్లి మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. సునీత అఫిడవిట్ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తారక్ ప్రద్యుమ్న కోరారు. కాగా.. ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్కు ఈసీ ఆమోదం తెలిపింది.
అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు వచ్చాయి. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ ముగియగా.. నేడు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఈ ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.మాగంటి సునీత నామినేషన్కు ఈసీ ఆమోదం తెలిపినప్పటికీ.. ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది. ఈ ఆరోపణలపై సునీత ఇంతవరకు స్పందించలేదు. అయితే షేక్పేట్ ఆర్వో కార్యాలయానికి మాగంటి సునీత వచ్చారు. నామినేషన్లో తాను పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులకు డిక్లరేషన్ ఫారమ్ అందజేశారు.


