Jubilee Hills By Election sensational news on maganti sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సంచలనం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత విషయంలో ఇప్పుడో న్యూస్ వైరల్గా మారింది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తీవ్రమైన ఆరోపణలు చేయడమే కాకుండా సునీత గోపినాథ్ భార్యే కాదంటూ ఎన్నికల అధికారికి తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదు చేశారు.సునీత అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని. తారక్ ప్రద్యుమ్న ఆరోపించారు. మాగంటి గోపినాథ్కు చట్టబద్ధమైన ఏకైక కుమారుడిని తానేనంటూ స్పష్టం చేశారు. గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న తన తల్లి కోసరాజు మాలిని దేవిని పెళ్లి చేసుకున్నారని వివరించారు. మాగంటి గోపినాథ్ మాలిని దేవికి విడాకులు ఇవ్వలేదని, ఇప్పటికీ నా తల్లి మాగంటి గోపినాథ్ భార్యనేనని, అలాంటపుడు సునీత భార్య ఎలా అవుతుందని గోపినాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న ప్రశ్నించాడు. తన తండ్రి సునీతను పెళ్లి చేసుకోలేదని, కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఉన్నారని, తన తండ్రికి అసలైన వారసుడిని తానేనని స్పష్టం చేశారు. సునీత ఈ విషయాన్ని దాచిపెట్టి తనను తాను గోపినాథ్కు చట్టబద్ధమైన భార్యగా.. తన పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పుగా చూపించారని తారక్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే గోపినాథ్ మొదటి పెళ్లి విషయాలను దాచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని తారక్ ప్రద్యుమ్న డిమాండ్ చేశారు.
అందుకే విష్ణువర్థన్ రెడ్డితో నామినేషన్ వేయించారా?
“నా తల్లి మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సునీత అఫిడవిట్ను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. న్యాయబద్దంగా ఎమ్మెల్యే టిక్కెట్టు తన తల్లికి రావాలి. సునీత తన అనుచరులతో తమని బెదిరించింది. వెంటనే ఆమె నామినేషన్ రద్దు చేయాలి.” అని ఎన్నికల అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో ప్రద్యుమ్న డిమాండ్ చేశాడు. కాగా, ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్కు ఈసీ ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. మరోవైపు, ఇవాళ మాగంటి సునీత షేక్పేట్ ఆర్ఓ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం సరైందేనని మరో డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, సునీతపై ఈ ఆరోపణలు రావడం రాజకీయాల్లో కలకలం రేగింది. దీంతో,, బీఆర్ఎస్ ఆచీతూచి స్పందించాలని చూస్తోంది. చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా విష్ణువర్థన్ రెడ్డితో మరో నామినేషన్ వేయించింది.


