Jubilee Hills By Election Exit Polls Survey: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఫలితాల కోసం ఈ ఒక్క నియోజకవర్గమే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఇక, పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్టిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు అన్నీ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకే విధంగా ఉన్నాయి.
చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్కు 46 శాతం, బీఆర్ఎస్కు 43 శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, HMR సర్వే.. కాంగ్రెస్కు 48.30 శాతం, బీఆర్ఎస్కు 43.18 శాతం, బీజేపీకి 5.84 శాతం ఓట్లు పోల్ అవుతాయని ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడించింది. స్మార్ట్ పోల్ సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్కు 48.2 శాతం, బీఆర్ఎస్ పార్టీకి 42.10 శాతం, బీజేపీకి 7.6 శాతం, ఇతరులకు 2.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. నాగన్న సర్వే కాంగ్రెస్కు 47 శాతం, బీఆర్ఎస్కు 41 శాతం ఓట్లు సాధించవచ్చని అంచనా వేస్తునట్లు తెలిపింది.
సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ద్వారా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక నవంబర్, 14న వెల్లడయ్యే ఫలితాల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పక్షానికి పట్టం కడుతున్నారా.. లేక ప్రభుత్వంపై అసంతృప్తితో మళ్లీ బీఆర్ఎస్కే ప్రాధాన్యం ఇస్తున్నారా అనేది తేలుతుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-by-election-2025-voting-day-live-updates/
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక కోసం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే నెలకొంది. ప్రచారం కూడా ఆ రీతిలోనే హోరాహోరీగా జరిగింది. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం బీజేపీని నిరాశపరుస్తున్నాయి. బీఆర్ఎస్ తరపున గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో దిగగా, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా.. మూడు పార్టీల వారు ఎవరికి వారు గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


