Friday, September 20, 2024
HomeతెలంగాణSunil Rao: కరీంనగర్ విలీన శివారు గ్రామాల అభివృద్ధి

Sunil Rao: కరీంనగర్ విలీన శివారు గ్రామాల అభివృద్ధి

కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ నగరం మధ్యలో ఉన్న డివిజన్లు ఎలాగైతే అభివృద్ధి చెందాయో విలీన గ్రామాలు, శివారు ప్రాంత డివిజన్లను కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తున్నామని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం రోజు 1వ డివిజన్ లో మేయర్ పర్యటించారు. తీగలగుట్టపల్లి ప్రాంతంలోని సరస్వతి నగర్ లో కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 24 లక్షల నిధులతో మంచి నీటి సరఫరా పైపులైన్ అభివృద్ధి పనులకు మేయర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

- Advertisement -

పైపులైన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ తో పాటు అదికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ విలీన గ్రామాలు, శివారు ప్రాంత డివిజన్ల అభివృద్ధిపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచనల మేరకు 8 విలీన గ్రామాల డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాక ఆయా ప్రాంత ప్రాంతాలు అభివృద్ధి చెందాయనే సంతృప్తిని కలిగించే విధంగా తమ పాలకవర్గం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి విలీన గ్రామంతో పాటు శివారు ప్రాంత డివిజన్లలో ఒక ప్రణాళిక ప్రకారం చక్కటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, మంచి నీటి సరఫరా కోసం పైపులైన్ వేసి, సీసీ రోడ్లు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. దశలవారీగా విలీన గ్రామాల డివిజన్ల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా విలీన గ్రామాల డివిజన్ల మంచి నీటి సరఫరాను మెరుగు పరిచేందుకు 147 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ప్రజల త్రాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు ప్రతి విలీన డివిజన్ లో ప్రతిపాదనలు రూపొందించి పైపులైన్ వేసి ప్రజలకు త్రాగునీరు అందిస్తామని తెలిపారు. తీగలగుట్టపల్లి ప్రాంతంతో పాటు రేకుర్తి, అల్గునూరు, ఆరెపల్లి, సదాశివ పల్లి, వల్లం పహాడ్, పద్మానగర్, సీతారాంపూర్ ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీర్చేందుకు సరైన ప్రతిపాదనలతో ప్రతి వీధిలో పైపులైన్ లు వేసి, అవసరమైన చోట రిజర్వాయర్లు నిర్మాణం చేసి ట్రక్ మేయిన్స్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు వేసి త్వరలోనే పనులు చేయడం జరుగుతుందన్నారు. ఈ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలోనే పనులు ప్రారంభం చేస్తామన్నారు.

147 కోట్ల రూపాయల పనులు పూర్తైతే భవిష్యత్తులో 40 సంవత్సరాల వరకు ప్రజల త్రాగునీటికి ఎలాంటి సమస్యలుండవన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా పలు విలీన గ్రామాలకు నగరపాలక సంస్థలో ఉన్న నెట్ వర్కుతో త్రాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అంతేకాక కాకుండా ముఖ్యమంత్రి హామీ నిధులకు సంబంధించిన 132 కోట్లలో విలీన గ్రామాల డివిజన్ల అభివృద్ధికే అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. త్వరలోనే డివిజన్ల వారీగా అభివృద్ధి పనులన్నీ ప్రారంభం చేసి పూర్తి చేస్తామని తెలిపారు. తీగలగుట్ట ప్రాంతానికి సంబంధించి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పనులు చేశామన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ప్రధాన రోడ్లలో డ్రైనేజీ నిర్మాణం, అమ్మగుడి నుండి మొదలుకొని ప్రధాన రహదారి వరకు రెండు వైపుల డ్రైనేజీ రోడ్డు నిర్మాణం, ఇతర కాలనీల్లో నూతన రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేశామని తెలిపారు. సీఎం అస్యూరెన్స్ నిధుల్లో తీగలగుట్టపల్లి ప్రాంత అభివృద్ధికి దాదాపు 6 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్లలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విలీన గ్రామాల డివిజన్లలో నూతనంగా నివాస గృహాలు ఏర్పడి కాలనీలుగా మారడంతో ప్రజల నుండి వచ్చే డిమాండ్ల ప్రకారం వారి అవసరాలను తీర్చేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కరీంనగర్ నగరంలో ఎలా అభివృద్ధి జరిగిందో అదేవిధంగా విలీన గ్రామాలు, శివారు ప్రాంత డివిజన్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్ లు అనునిత్యం తమ వెంట ఉండి నిధులకు ఎక్కడా కొరత రాకుందా సమకూర్చుతున్నారు కాబట్టే కరీంనగర్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News