Kavitha Bathukamma Celebrations: తెలంగాణ సాంస్కృతికి నిలువుటద్దగా నిలిచే బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సంబరాల తొలిరోజును ఎంగిలి పూల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఇప్పటికే బతుకమ్మ సంబరం ఊరూరా, వాడ వాడన పూల జాతర షురూ అయ్యింది. బతుకమ్మలను పూలతో పేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా సంబరాలను జరుపుకుంటున్నారు మహిళలు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత గ్రామం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక వెళ్లారు. చింతమడకలోనే బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. చింతమడక గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నారామ్ ముత్యం ఆహ్వానం మేరకు వెళ్లిన కవిత.. ఆయన ఇంట్లో తోటి మహిళలతో కలిసి పాటలు పాడుతూ ఎంగిలి పూల బతుకమ్మను పేర్చారు. అనంతరం మహిళలతో కలిసి ఆడిపాడారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బహిష్కరించడం.. సస్పెన్షన్ వేటు పడటంతో ఆమె పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత బతుకమ్మ వేడుకల కోసం ఆమె తొలిసారి తన సొంతూరు చింతమడకకు వెళ్లడంతో కవిత పర్యటనపై ఆసక్తి నెలకొంది.
Also Read: https://teluguprabha.net/national-news/gst-bachat-utsav-begins-tomorrow/
వేయి స్తంభాల గుడిలో అధికారికంగా వేడుకలు..
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ సంబరాలను ప్రారంభించింది. వరంగల్ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు ప్రభుత్వ పరంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్య హాజరయ్యారు. ఈ ఏడాది వరంగల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుంది. ఆదివారం ఓరుగల్లులో మొదలైన బతుకమ్మ వేడుకలు ఈనెల 30న హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద ముగియనున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.


